రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమీర్ జెలెన్స్కీ కీలక ప్రతిపాదన తెచ్చారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్తో భేటీ కావాలని తాను భావిస్తున్నట్లు కీలక ప్రకటన చేశారు. మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ సమావేశం ద్వారా ఉక్రెయిన్ అధ్యక్షుడు ఈ ప్రతిపాదనను ముందుకు తేవడం కీలక పరిణామం. అయితే.. పాశ్చాత్య శక్తులు రష్యా పట్ట తమ తమ బుజ్జగింపు విధానాలను విడనాడాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు హితవు పలికారు.
అసలు రష్యా అధ్యక్షుడు పుతిన్కు ఏం కావాలో నాకైతే తెలియదు. అందుకే ఆయనతో భేటీ కావాలన్న ప్రతిపాదనను తీసుకొస్తున్నా. ఏ స్థలమైనా నాకు పర్లేదు. వారే ఓ స్థలాన్ని సూచించినా ఇబ్బంది లేదు. శాంతియుత వాతావరణాన్నే కోరుకుంటున్నాం. దౌత్యపరంగానే సమస్యలు పరిష్కారం కావాలన్నది మా అభిమతం అంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ స్పష్టం చేశారు. తమపై రష్యా అతిపెద్ద అణ్వాయుధాన్ని ప్రయోగించడానికి సిద్ధంగా ఉందని విన్నామని, తమ వద్ద మాత్రం ఎలాంటి ఆయుధాలూ లేవని, అయితే ఓ హక్కు మాత్రం ఉందన్నారు. దౌత్యం ద్వారా, శాంతి ప్రయత్నాల ద్వారా సమస్యను పరిష్కరించుకుంటూ శాంతియుత వాతావరణం కల్పించాలని అడిగే హక్కు మాత్రం తమకు ఉంటుందని ఉక్రెయిన్ అధ్యక్షుడు స్పష్టం చేశారు.