న్యూఢిల్లీ, ఏప్రిల్ 4: హొర్ముజ్ జల సంధి ఇప్పటికే ఒత్తిడికి గురవుతున్న నేపథ్యంలో మరో కీలకమైన ప్రపంచ నౌకా రవాణా మార్గమైన బాబ్ ఎల్-మండేబ్ జల సంధిపై దృష్టి సారించడం ద్వారా ఒత్తిడిని మరింత పెంచవచ్చని ఇరాన్ సంకేతాలు ఇచ్చింది. ఇది సరఫరా గొలుసులు, ఇంధన ప్రవాహాలపై కొత్త ఆందోళనలు రేకెత్తిస్తోంది. ప్రస్తుతం హొర్ముజ్ జలసంధికి కల్పిస్తున్న అడ్డంకుల కారణంగా నౌకా రవాణాకు విఘాతం ఏర్పడి ప్రపంచ మార్కెట్లు ఒడిదొడుకులను ఎదుర్కొంటుండగా ఇప్పుడు ఇరాన్ పార్లమెంటరీ నాయకత్వం నుంచి ఈ వ్యాఖ్యలు రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బఘేర్ ఘలీబాఫ్ ఎక్స్ వేదికగా పెట్టిన వరుస పోస్టులలో బాబ్ ఎల్-మండేబ్ జలసంధికి ప్రపంచ వాణిజ్యంలో ఉన్న ప్రాముఖ్యతను ప్రస్తావిస్తూ తదుపరి దీన్ని లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందని సంకేతాలు ఇచ్చారు. ప్రపంచ చమురు, ఎల్ఎన్జీ, గోధుమలు, బియ్యం, ఎరువుల రవాణాలో ఎంత వాటా బాబ్ ఎల్-మండేబ్ జల సంధి గుండా వెళుతున్నది? అని ఆయన ప్రశ్నించారు. ఈ జల సంధి గుండా అత్యధిక రవాణా పరిమాణాలను ఏయే దేశాలు, ఏ కంపెనీలు కలిగి ఉన్నాయని కూడా ఆయన ప్రశ్నించారు.
ప్రపంచంలోని అత్యంత కీలకమైన చమురు మార్గాలలో ఒకటైన హొర్ముజ్ జలసంధిపై ఇరాన్ తన నియంత్రణను కొనసాగిస్తూ అంతర్జాతీయ నౌకా రవాణాపై ఒత్తిడిని, ఖర్చులను పెంచుతున్న తరుణంలో పార్లమెంట్ స్పీకర్ నుంచి ఈ వ్యాఖ్యలు వెలువడడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఎర్ర సముద్రాన్ని ఏడెన్ గల్ఫ్తో కలిపే మరో కీలక సముద్ర మార్గమైన బాబ్ ఎల్-మండేబ్పై ఆసక్తిని కనబరచడం ద్వారా ఇరాన్ తన వ్యూహాత్మక ఎత్తుగడలను విస్తరిస్తున్నట్లు కనిపిస్తున్నది.
ఘలీబాఫ్ వ్యాఖ్యలు ప్రపంచ సరఫరా గొలుసులు ముఖ్యంగా ఇంధనం, నిత్యావసర వస్తువుల రంగాల్లోని నిస్సహాయతను సూటిగా బయటపెడుతున్నాయి. చమురు, ఎల్ఎన్జీ రవాణాతోపాటు గోధుమలు, బియ్యం వంటి కీలక ఆహార సరఫరాలు కూడా ఇరుకైన సముద్ర మార్గాల గుండా జరిగే సురక్షిత రవాణాపై ఎక్కువగా ఆధారపడి ఉన్నాయి.
పశ్చిమాసియా ఉద్రిక్తతలు చల్లారే పరిస్థితులు కనిపించడం లేదు. తాజాగా ఇరాన్ భూభాగంలో జరిగిన వైమానిక దాడుల్లో ఒక ఇరాకీ పౌరుడు మరణించడంతో ఇరాక్ ఇరాన్తో ఉన్న షాలంచెహ్ సరిహద్దు క్రాసింగ్ను మూసివేసినట్లు భద్రతా వర్గాలు శనివారం తెలిపాయి. ఇరాన్ వైపున ఉన్న ప్రయాణికుల వెయిటింగ్ ప్రాంతంపై జరిగిన ఈ దాడుల్లో కనీసం ఐదుగురు ఇరాకీలు తీవ్రంగా గాయపడ్డారని వర్గాలు తెలిపాయి. మరో వైపు ఇరాక్లోని ఉత్తర రుమైలా చమురు క్షేత్రంపై డ్రోన్ దాడిలో ముగ్గురు కార్మికులు గాయపడ్డారు.
దక్షిణ ఇరాన్లోని ఒక సిమెంట్ కర్మాగారంపై శనివారం అమెరికా-ఇజ్రాయెల్ దాడులు జరిపినట్లు మీడియో పేర్కొంది. ఇరాన్లోని బుషెహర్ అణు విద్యుత్ కేంద్రంపై క్షిపణి దాడి జరిగింది. నైరుతి ఇరాన్లోని ఒక పెట్రో కెమికల్స్ కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుని అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఐదుగురు గాయపడ్డారని ఓ అధికారి తెలిపినట్లు ఇరాన్ మీడియా తెలిపింది.