కాబూల్ : ఆఫ్ఘనిస్థాన్లో మద్యం అమ్మకాలపై తాలిబన్లు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఆఫ్ఘణ ఇంటెలిజెన్స్ ఏజెంట్స్ బృందాలు సుమారు 3 వేల లీటర్ల మద్యాన్ని కాబూల్లోని కాలువల్లో పారబోశారు. ఇందుకు సంబంధించిన వీడియోను జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అధికారులు విడుదల చేశారు. మద్యం తయారు చేయడం, విక్రయించడం వంటి చర్యలను సహించబోమని తాలిబన్లు ప్రకటించారు. ముస్లింలకు ఇది సరైంది కాదని హెచ్చరించారు. అయితే మద్యాన్ని ఎక్కడ స్వాధీనం చేసుకున్నారు? అనే విషయం తెలియరాలేదు. ఈ మద్యానికి సంబంధించిన ముగ్గురు వ్యక్తులను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆఫ్ఘన్ను తాలిబన్లు స్వాధీనం చేసుకున్న తర్వాత మద్యం విక్రయాలతో పాటు డ్రగ్స్ సరఫరాపై ఉక్కుపాదం మోపుతున్నారు.