కాబూల్: ఆప్ఘనిస్థాన్ను తమ ఆధీనంలోకి తెచ్చుకున్న తాలిబన్లు తమ నైజాన్ని బయటపెడుతున్నారు. కార్యాలయాలపై ఆఫ్ఘన్ జెండాను ఉంచాలని డిమాండ్ చేస్తూ ఆ దేశ జాతీయ జెండాతో నిరసన తెలిపిన వారిపై కాల్పులు జరిపారు. జలాలాబాద్లో బుధవారం ఈ ఘటన జరిగింది. ప్రభుత్వ కార్యాలయాలపై తాలిబన్ల జెండా బదులు ఆఫ్ఘనిస్థాన్ జెండాను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ జలాలాబాద్లో కొందరు బుధవారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఆఫ్ఘన్ జెండాతో నిరసన తెలిపారు.
దీంతో తాలిబన్లు నిరసనకారులపై కాల్పులు జరిపారు. నిరసనను చిత్రీకరిస్తున్న జర్నలిస్టులను కూడా కొట్టారు. ఈ ఘటన నేపథ్యంలో నిరసనకారులు భయంతో పరుగులుతీశారు. ఈ కాల్పుల్లో కొందరు మరణించి ఉంటారని తెలుస్తున్నది.