కాబూల్: ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్లో నిరసనకు దిగిన మహిళలను తాలిబన్లు కొట్టారు. అలాగే అక్కడున్న జర్నలిస్టులపై కూడా దాడి చేశారు. దీనికి ముందు తుపాకులతో గాల్లోకి కాల్పులు జరిపారు. గత ఏడాది ఆగస్ట్ 15న అమెరికా సైన్యం ఆఫ్ఘనిస్థాన్ను వీడుతున్న తరుణంలో తాలిబన్లు అనూహ్యంగా రాజధాని కాబూల్లోకి ప్రవేశించారు. అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ దేశం వీడి పారిపోవడంతో మరోసారి అధికారాన్ని హస్తగతం చేసుకున్నారు. అనంతరం తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేసి ఆ దేశాన్ని పాలిస్తున్నారు.
కాగా, తాలిబన్ల రెండో విడత పాలన మొదలై సోమవారానికి ఏడాది పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో తమపై విధించిన ఆంక్షలపై ఆ దేశ మహిళలు గళమెత్తారు. రాజధాని కాబూల్లోని విద్యా మంత్రిత్వ శాఖ భవనం వద్ద శనివారం పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. ఆహారం, పని, స్వేచ్ఛ కావాలంటూ నినాదాలు చేశారు. కాబూల్ను తాలిబన్లు స్వాధీనం చేసుకున్న ఆగస్ట్ 15ను బ్లాక్ డేగా అభివర్ణించారు. ఈ మేరకు బ్యానర్లు ప్రదర్శించారు. చాలా నెలల తర్వాత ఆ దేశ మహిళలు భారీగా నిరసనకు దిగారు. బాలికలను విద్యకు దూరం చేయడం, మహిళలు ఉద్యోగాలు చేయకుండా ఆంక్షలు విధించడం, తమ హక్కులను హరించడంపై గళమెత్తారు. తమకు న్యాయం కావాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
మరోవైపు మహిళ నిరసన ప్రదర్శనను తాలిబన్లు అణచివేశారు. తొలుత తుపాకులతో గాల్లోకి కాల్పులు జరిపారు. అనంతరం లాఠీలు, తుపాకీలతో మహిళలను కొట్టారు. బ్యానర్లను చించి వేశారు. వీడియోలు రికార్డు చేస్తున్న మొబైల్ ఫోన్లను లాక్కున్నారు. అక్కడి షాపుల్లో దాక్కున్న మహిళలను వెంబడించి దాడి చేశారు. అంతేగాక వార్తలను కవర్ చేస్తున్న జర్నలిస్టులను కూడా సాయుధ తాలిబన్లు కొట్టారు.