కాబూల్: ఆఫ్ఘనిస్థాన్ ( Afghanistan ) పూర్తిగా తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిపోవడానికి ఇక ఎక్కువ సమయం పట్టే అవకాశాలు కనిపించడం లేదు. తాలిబన్ తిరుగుబాటుదారులు రాజధాని కాబూల్లోకి ప్రవేశించినట్లు ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎఫ్పీ వెల్లడించింది. ఇప్పటికే దేశంలోని అన్ని ప్రధాన నగరాలను ఆక్రమించిన తాలిబన్లు.. ఇప్పుడు రాజధాని నగరాన్నీ తమ ఆధీనంలోకి తీసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఆదివారం ఉదయమే తాలిబన్లు మరో ప్రధాన నగరమైన జలాలాబాద్ను తమ ఆధీనంలోకి తీసుకున్న విషయం తెలిసిందే. అంతకు కొన్ని గంటల ముందే వాళ్లు మజారె షెరీఫ్లోనూ వాళ్లు తమ జెండాను ఎగరేశారు. కేవలం పది రోజుల్లోనే ఆఫ్ఘన్ సేనలను ఓడించి తాలిబన్లు మొత్తం దేశమంతా విస్తరించడం గమనార్హం.