ఇస్లామాబాద్, జనవరి 28: మహిళల విద్యపై అఫ్ఘాన్ ప్రభుత్వం ఆంక్షలను రెట్టింపు చేసింది. యూనివర్సిటీ ప్రవేశ పరీక్షలకు వారిని అనుమతించరాదంటూ శనివారం ప్రైవేట్ విశ్వవిద్యాలయాలకు ఆదేశాలు జారీచేసింది. గ్రాడ్యుయేట్, పోస్టు గ్రాడ్యుయేట్, డాక్టరేట్ స్థాయి ప్రవేశాలకు నిర్వహించే ఎలాంటి పరీక్షలకు వారికి అనుమతి ఇవ్వవద్దంటూ తాలిబన్ ప్రభుత్వం ఆదేశించింది. దీనిని ఆ దేశ విద్యాశాఖ ప్రతినిధి జియాఉల్లా హష్మీ నిర్ధారించారు.
మహిళల చదువుపై అఫ్ఘాన్లో అమలవుతున్న ఆంక్షలపై ప్రపంచ దేశాల నుంచి నిరసన వ్యక్తం అవుతున్నది. మహిళల స్వేచ్ఛ, ఆంక్షలు లేని విద్య కోసం అంతర్జాతీయ స్థాయిలో ఆ దేశంపై ఒత్తిడి వస్తున్నది. ఈ నేపథ్యంలోనే ఐక్యరాజ్యసమితి ప్రతినిధులు సైతం ఈ నెలలో వరుస పర్యటనలు జరిపి ఆ దేశ నేతలతో చర్చలు జరుపుతున్నారు. దీంతో మహిళల విద్యపై ఆంక్షలను అఫ్ఘాన్ ప్రభుత్వం ఎత్తివేయడం గాని, సవరించడం గాని చేస్తుందని అందరూ ఆశిస్తున్న స్థాయిలో మరిన్ని ఆంక్షలు విధిస్తూ తాలిబన్ పాలకులు ఉత్తర్వులు జారీ చేయడం విస్మయపరిచింది. ఇప్పటికే అఫ్ఘాన్లో బాలికల హైస్కూల్ స్థాయి చదువులపై పలు ఆంక్షలు అమలవుతున్నాయి.