Today History: పుల్వామాలో కాపు కాసి దాదాపు 40 మంది సైనికుల ఊచకోతకు కారణమైన తీవ్రవాదుల పని పట్టేందుకు భారత సైన్యం చేపట్టిన సర్జికల్ స్ట్రైక్స్కు సరిగ్గా నేటితో మూడేండ్లు పూర్తయ్యాయి. పాకిస్థాన్ వైపు సరిహద్దుల్లో ఉన్న తీవ్రవాదుల శిక్షణ శిబిరాలను ధ్వంసం చేసి భారత సైన్యం పైచేయి సాధించింది. భారత విమానాలు ఏకంగా పొరుగు దేశంలోకి చొచ్చుకుపోయి బాంబుల వర్షం కురిపించాయి. తమ సైనికులను చంపడానికి ప్రతీకారం తీర్చుకున్నది భారత సైన్యం.
2019 ఫిబ్రవరి 14 న పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లు వెళ్తున్న కాన్వాయిని తీవ్రవాదులు పేల్చేశారు. ఈ పేలుడులో 40 మంది జవాన్లు అమరులయ్యారు. దీనిపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. సార్వత్రిక ఎన్నికలకు ముందు ఈ ఉగ్రదాడి జరగడంతో రాజకీయాలు కూడా వేడెక్కాయి. ఇది జరిగిన సరిగ్గా 12 రోజులకు.. అంటే 2019 ఫిబ్రవరి 26న, భారత వైమానిక దళానికి చెందిన మిరాజ్-2000 విమానం రాత్రి వేళ నియంత్రణ రేఖ (ఎల్ఓసి)ను దాటి పాకిస్థాన్ వైపున ఉన్న బాలాకోట్లోని జైష్-ఎ-మహ్మద్ శిక్షణా శిబిరాలపై సర్జికల్ స్ట్రైక్ చేసింది.
పాకిస్తాన్ ఈశాన్య ప్రాంతమైన ఖైబర్ పఖ్తున్ఖ్వా తీవ్రవాదుల అడ్డాను తునాతునకలు చేశారు. ఈ సర్జికల్ స్ట్రైక్లో చాలా మంది తీవ్రవాదులు చనిపోయినప్పటికీ పాకిస్థాన్ మిన్నకుండి పోయింది. మరుసటి రోజు ప్రతీకారం తీర్చుకునే ప్రయత్నం పాకిస్థాన్ చేసింది. పాకిస్థాన్కు చెందిన ఎఫ్-16 యుద్ధ విమానాన్ని భారత వైమానిక దళానికి చెందిన మిగ్-21 కూల్చివేసింది. పాకిస్థాన్ కూడా మన మిగ్-21 విమానాన్ని కూల్చివేసి, వింగ్ కమాండర్ అభినందన్ను అరెస్టు చేసింది. అయితే మూడు వైపుల నుంచి వచ్చిన ఒత్తిడికి తలొగ్గిన పాకిస్థాన్ ప్రభుత్వం రెండు రోజుల తర్వాత అభినందన్ను క్షేమంగా భారత్కు అప్పగించారు.