4నెలల తర్వాత బయటకు..
నైపిటా, మే 24: సుమారు నాలుగు నెలలుగా నిర్బంధం ఎదుర్కొంటున్న మయన్మార్ నాయకురాలు ఆంగ్ సాన్ సూకీ సోమవారం కోర్టు ఎదుట హాజరయ్యారు. పలు కేసులలో విచారణ సందర్భంగా కోర్టుకు హాజరైన ఆమెకు వ్యక్తిగత న్యాయవాదులను కలవడానికి 30 నిమిషాలపాటు అవకాశం కల్పించారు. ఇదే విషయమై ఆమె న్యాయవాది మిన్ మిన్ సొయె స్పందిస్తూ.. సూకీ ఆరోగ్యంగానే ఉన్నారని తెలిపారు. మయన్మార్లో ప్రజలు మనుగడ సాగించినంత కాలం తమ పార్టీ నేషనల్ లీగ్ ఫర్ డెమొక్రసీ (ఎన్ఎల్డీ) ప్రజలకు మద్దతుగా ఉంటుందని ఆమె చెప్పారని అన్నారు. గతేడాది మయన్మార్లో జరిగిన ఎన్నికలలో భాగంగా ఆమె అవకతవకలకు పాల్పడ్డారని, వాకీటాకీలపై నిషేధం ఉన్నా వాటిని వాడారని ఆరోపిస్తూ సూకీపై పలు కేసులు నమోదయ్యాయి.