న్యూయార్క్: మెట్ గాలా( MET Gala ).. సెలబ్రిటీలు డిజైనర్ వేర్ దుస్తుల్లో మెరిసిపోతూ కనిపించే మెగా ఈవెంట్. ప్రతి ఏటా మే నెలలో అమెరికాలోని న్యూయార్క్ నగరంలో జరుగుతుందీ వేడుక. కానీ ఈసారి మాత్రం కరోనా కారణంగా సెప్టెంబర్కు వాయిదా పడింది. ఈ మెట్ గాలా రెడ్ కార్పెట్పై ప్రపంచం నలుమూలల నుంచీ సెలబ్రిటీలు హొయలు పోతూ ఫొటోలకు పోజులిస్తారు. అలాంటి ఈవెంట్లో ఈసారి ఇండియా నుంచి ఒకే ఒక్క వ్యక్తి పాల్గొన్నారు. ఆమె పేరు సుధా రెడ్డి. అయితే ఆమె సెలబ్రిటీయో, సినిమా స్టారో కాదు.
ఎవరీ సుధారెడ్డి?
పేరు చూడగానే మీకు తెలిసిపోయే ఉంటుంది. ఈమె మన హైదరాబాదీయే. నగరానికి చెందిన బడా వ్యాపారవేత్త మేఘా కృష్ణారెడ్డి తెలుసు కదా. సుధారెడ్డి ఆయన భార్యే. మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ డైరెక్టర్ కూడా అయిన ఈమె తొలిసారి మెట్ గాలా రెడ్ కార్పెట్పై తళుక్కుమని మెరిశారు. డిజైనర్ జోడీ ఫాల్గుని, షేన్ పీకాక్ రూపొందించిన గౌన్లో సుధారెడ్డి కనిపించారు. ఆర్ట్, ఫ్యాషన్ అంటే తనకు చాలా ఇష్టమని చెప్పే సుధారెడ్డి.. తొలిసారి ఇలా ఓ అంతర్జాతీయ వేదికపై కనిపించడం విశేషం. గతంలో ఇండియా నుంచి ప్రియాంకా చోప్రా, దీపికా పదుకోన్, ఇషా అంబానీలాంటి వాళ్లు మెట్ గాలాలో సందడి చేశారు. తొలిసారి హైదారాబాద్ నుంచి సినిమాలకు సంబంధం లేని సుధారెడ్డి మెట్ గాలా రెడ్కార్పెట్పై కనువిందు చేశారు.
గౌన్.. చాలా స్పెషల్
సుధారెడ్డి వేసుకున్న గౌన్ చాలా స్పెషల్. దీనిని తయారు చేయడానికి సుమారు 250 గంటల సమయం పట్టినట్లు డిజైన్లు ఫాల్గుని, షేన్ పీకాక్ చెప్పారు. ఇక డిజైనర్ ఫరా ఖాన్ చేసిన డ్రీమీ డెకాడెన్స్ జువెలరీని సుధారెడ్డి ధరించారు.