ఖర్తూమ్/న్యూఢిల్లీ, ఏప్రిల్ 25: సూడాన్లో ఆర్మీ, ఆర్ఎస్ఎఫ్ బలగాలు మూడు రోజుల పాటు కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకారం తెలిపాయని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ సోమవారం తెలిపారు. తమ పౌరులను సురక్షితంగా తరలించేందుకు పలు దేశాలు చర్యలు ప్రారంభించిన నేపథ్యంలో.. అందుకు సానుకూల పరిస్థితులు కల్పించేందుకు చర్చలు జరిపిన రెండు వర్గాలు కాల్పుల విరమణ ఒప్పందంపై అంగీకారానికి వచ్చాయి.
ఈ ఒప్పందం ఏప్రిల్ 24 అర్ధరాత్రి నుంచి అమల్లో ఉంటుందని బ్లింకెన్ తెలిపారు. మరోవైపు ‘ఆపరేషన్కావేరీ’ చేపట్టిన భారత్.. మంగళవారం 278 మంది భారతీయులను సూడాన్ నుంచి సురక్షితంగా తరలించింది. ఇంకా దాదాపు 3 వేల మంది భారతీయులు సూడాన్లో చిక్కుకొన్నట్టు సమాచారం.