న్యూఢిల్లీ: ఎర్ర సముద్రం వద్ద హౌతి రెబల్స్(Houthi Rebels).. రవాణా నౌకలపై దాడి చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికా, బ్రిటన్ దళాలు.. యెమెన్లోని హౌతి స్థావరాలపై అటాక్ చేశాయి. గడిచిన నవంబర్ నుంచి ఇరాన్ మద్దతు ఇస్తున్న హౌతీలు రెచ్చిపోతున్నారని, ఓడలపై దాడులు చేస్తున్నారని, అందుకే ప్రతిదాడికి దిగినట్లు అమెరికా ప్రెసిడెంట్ బైడెన్ తెలిపారు. బ్రిటన్కు చెందిన రాయల్ ఎయిర్ ఫోర్స్ యుద్ధ విమానాలు రంగంలోకి దిగినట్లు ఆ దేశ ప్రధాని రిషి సునాక్ తెలిపారు. ఆత్మ రక్షణ ఉద్దేశంతోనే ఆ దాడులు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. నెదర్లాండ్స్, ఆస్ట్రేలియా, కెనడా, బహ్రెయిన్ దేశాలు తమకు సపోర్టు ఇస్తున్నట్లు బైడెన్ తెలిపారు. యెమెన్ రాజధాని సనాపై భీకరంగా బాంబు దాడులు జరిగినట్లు తెలుస్తోంది.
అమెరికా దళాలు ఆ దాడులకు చెందిన ప్రకటన చేశాయి. సుమారు 16 ప్రదేశాల్లో 60 టార్గెట్లను ధ్వంసం చేసినట్లు అమెరికా పేర్కొన్నది. హౌతీ రెబల్స్ వాడుతున్నట్లు ఆ క్షేత్రాలపై బాంబులతో అటాక్ చేసినట్లు యూఎస్ ఎయిర్ఫోర్స్ చెప్పింది. కమాండ్, కంట్రోల్ నోడ్స్, మునిషన్ డిపోలు, లాంచింగ్ సిస్టమ్స్, ప్రొడక్షన్ ఫెసిలిటీలు, ఎయిర్ డిఫెన్స్ రేడార్ సిస్టమ్లను టార్గెట్ చేసినట్లు అమెరికా తన ప్రకటనలో పేర్కొన్నది. సుమారు వందకు పైగా ప్రిషిసన్ గైడెడ్ మునిషన్స్ను వాడినట్లు తెలుస్తోంది. మిడిల్ ఈస్ట్ దేశాలకు తమ మద్దతు ఉంటుందని అమెరికా పేర్కొన్నది.
గాజాలో యుద్ధం మొదలైన నాటి నుంచి హౌతీ రెబల్స్ ఇప్పటి వరకు 27 నౌకలపై దాడి చేశారు. దీంతో ఎర్రసముద్రం రూట్లో వచ్చే ఇంధన నౌకల రవాణాకు బ్రేక్ పడింది. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలపై ప్రభావం పడుతున్నది. ఎర్ర సముద్రం రూట్లో సుమారు 15 శాతం ఇంధన సరఫరా జరుగుతుంది.