కొలంబో, జూన్ 22: శ్రీలంకలో ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిందని దేశ ప్రధాని రణిల్ విక్రమసింఘే పేర్కొన్నారు. ఆయిల్, గ్యాస్, విద్యుత్తు, ఆహారం కొరతతో తీవ్ర గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నామని చెప్పారు. ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో అదనపు రుణ సదుపాయం పొందేందుకు ఐఎంఎఫ్తో ముందస్తు ఒప్పందానికి రావాల్సిన ఆవశ్యకత ఉన్నదని నొక్కిచెప్పారు. దేశ నెలకొన్న సంక్షోభ పరిస్థితులు, పరిష్కారానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ప్రధాని రణిల్ విక్రమసింఘే బుధవారం పార్లమెంట్లో మాట్లాడారు. ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిన దేశాన్ని తిరిగి గాడిలో పెట్టడం అంత సులభమైన పని కాదని, విదేశీ మారక నిల్వలు నిండుకున్న పరిస్థితి మరింత దారుణమైనదని, ప్రమాదకరమని పేర్కొన్నారు. భారత్ ఇప్పటికే 400 కోట్ల డాలర్ల మేర రుణం ఇచ్చిందని, ఇంకా కోరామని, అయితే ఇండియాతో సహా ఏ దేశం కూడా నిరంతరంగా మద్దతు ఇవ్వలేదు కదా! అన్నారు. దేశంలో నెలకొన్న పరిస్థితుల నుంచి మనం ఎలాగైనా బయటకు రావాల్సిన అవసరం ఉన్నదని, విదేశీ మారక నిల్వల సమస్యను పరిష్కరించుకోవాలని, ఇందుకుగానూ ఐఎంఎఫ్తో చర్చలు జరిపి అదనపు రుణం కోసం ఒప్పందాలు చేసుకోవడమే ఏకైక ఆప్షన్ అని పేర్కొన్నారు.