కొలంబో: తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకలో ప్రజల నిరసనలు కొనసాగుతున్నాయి. నిత్యవసర వస్తువుల నుంచి అన్ని ధరలు విపరీతంగా పెరుగడంతో ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రికి చెందిన కారును కొందరు నిరసనకారులు సరస్సులోకి తోసేశారు. మరి కొందరి నేతల కార్లను కూడా నీటిలోకి నెట్టివేశారు. పెట్రోల్, నిత్యవసరాలతోపాటు అవసరమైన మందులు కూడా లేవని, ప్రజలు ఒక పూట భోజనంతో సరిపెట్టుకుని పస్తులుండి ఇబ్బంది పడుతున్నారని ఒక వ్యక్తి వాపోయాడు. కాగా, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
మరోవైపు శ్రీలంకలో సోమవారం నిరసనలు తీవ్ర స్థాయికి చేరాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేస్తున్న వారిపై రాజపక్స మద్దతుదారులు దాడులు చేశారు. ప్రభుత్వ భద్రతా సిబ్బంది కూడా నిరసనకారులపై తమ ప్రతాపం చూపారు. దీంతో ప్రజలు ఆగ్రహంతో రగిలిపోయారు. అధికారంలో ఉన్న పలు ఎంపీల ఇళ్లు, వాహనాలకు నిప్పుపెట్టారు. ఈ హింసాత్మక ఘటనల్లో ఎంపీ, ఆయన భద్రతా అధికారితోసహా 9 మంది మరణించారు. 250 మందికిపైగా గాయపడ్డారు. ఈ పరిణామాల నేపథ్యంలో మహింద రాజపక్స ప్రధాని పదవికి రాజీనామా చేశారు. దీంతో ప్రతిపక్ష యునైటెడ్ నేషనల్ పార్టీ (యూఎన్పీ) నేత, 73 ఏండ్ల రణిల్ విక్రమ సింఘే ఐదోసారి శ్రీలంక ప్రధానిగా గురువారం ప్రమాణం చేశారు.
In Sri Lanka, Anger over the cost of living the public threw politicians' cars into the waters.
— 🥀_Imposter_🕸️ (@Imposter_Edits) May 11, 2022