కొలంబో : పొరుగు దేశం శ్రీలంక ప్రధాని మహింద రాజపక్స సోమవారం పదవికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని స్థానిక మీడియా తెలిపింది. ఆయనతో పాటు ఆరోగ్యశాఖ మంత్రి రాజీనామా లేఖను అధ్యక్షుడికి అందజేశారు. ప్రస్తుతం దేశంలో నెలకొన్న ఆర్థిక సంక్షోభం మధ్య ప్రజల నుంచి వ్యక్తమవుతున్న నిరసన వ్యక్తమవుతున్నది. మరో వైపు ప్రతిపక్షాలు సైతం ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేయడంతో పాటు రాజీనామాకు డిమాండ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో ఆయన పదవి నుంచి తప్పుకున్నట్లు తెలుస్తున్నది. మహింద రాజపక్స రాజీనామా నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంక్షోభం పరిష్కారమయ్యే వరకు అధ్యక్షుడు గోటబయ రాజపక్స తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు.
ఇటీవల గోటబయ అధ్యక్షతన రాష్ట్రపతి భవన్లో జరిగిన ప్రత్యేక కేబినెట్ సమావేశంలో ప్రధాని పదవికి రాజీనామా చేసేందుకు అంగీకరించారని, దీనిపై సోమవారం ప్రకటన చేస్తారని వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఆయన రాజీనామా చేశారు. విదేశీ మారకద్రవ్యం నిలువలు తగ్గిపోవడంతో శ్రీలంక ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్నది. దీంతో ధరలు భారీగా పెరగడంతో ఆహార సంక్షోభం నెలకొన్నది. పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. మరో వైపు విద్యుత్ కోతలు భారీగా విధిస్తుండడంతో జనం రోడ్లపైకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనకు దిగుతున్నారు. పలు చోట్ల ఆంక్షలు విధించినా.. లెక్క చేయకుండా ప్రధాని మహింద రాజపక్స, అధ్యక్షుడు గోటబయ రాజపక్సకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు.
స్వాతంత్య్రం అనంతరం శ్రీలంకలో ఎన్నడూ లేని విధంగా తీవ్రమైన ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్నది. సోమవారం ప్రధాని పదవికి మహింద రాజపక్స పదవికి రాజీనామా చేశారు. ఆయనతో పాటు ఆరోగ్యశాఖ మంత్రి ప్రొఫెసర్ చన్నా జయసుమన సైతం రాజీనామా లేఖను అధ్యక్షుడికి అందజేశారు. మహింద రాజపక్స ప్రధాని పదవి నుంచి వైదొలగుతున్నారనే వార్తలతో అధ్యక్షుడి కార్యాలయం వెలుపలు ఘర్షణ చెలరేగింది. ప్రభుత్వ అనుకూల వర్గాలు నిరసనకారులపై దాడి చేయడంతో 20 మందికిపైగా గాయపడ్డారు. ఆ తర్వాత ప్రభుత్వ దేశవ్యాప్తంగా కర్ఫ్యూను విధించింది. రాజధానిలో సైన్యాన్ని మోహరించింది.