Sri Lanka Under Emergency | శ్రీలంక అధ్యక్షుడు గోటబయా రాజపక్స శుక్రవారం దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించారు. భద్రతా బలగాలకు పూర్తి అధికారాలు అప్పగించారు. ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు రోజురోజుకు వెల్లువెత్తడంతో ఐదు వారాల్లో దేశంలో గోటబయా ఎమర్జెన్సీ విధించడం రెండోసారి. శాంతి భద్రతలను కాపాడేందుకు దేశ అధ్యక్షుడు నల్లచట్టాలను అమలు చేస్తున్నారని అధ్యక్ష అధికార ప్రతినిధి తెలిపారు.
దేశ ఆర్థిక వ్యవస్థ దారుణంగా మారడానికి కారణమైన దేశాధ్యక్షుడు గోటబయా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం కార్మిక సంఘాలు దేశవ్యాప్త సమ్మె జరిపాయి. ఆ తర్వాతే దేశంలో గోటబయా ఎమర్జెన్సీ విధించడం గమనార్హం. పార్లమెంట్లోకి దూసుకెళ్లడానికి ప్రయత్నించిన విద్యార్థులపైకి పోలీసులు శుక్రవారం ఉదయం టియర్ గ్యాస్, నీటి ఫిరంగులను ప్రయోగించారు.
తీవ్రమైన ఆహార కొరత, ఇంధన, ఔషధాల కొరతతో దేశ ప్రజలంతా నెలల తరబడి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 1948లో దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడానికి ప్రస్తుత ప్రభుత్వ అస్తవ్యస్త విధానాలే కారణం అని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వైదొలగాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగుతున్నారు.