చేసేందుకు పనుల్లేవ్. కడుపు నింపుకొనేందుకు తిండి లేదు. పూట గడవటమే కష్టంగా మార్చిన ఆర్థిక సంక్షోభం. దీనికి కారణమైన రాజకీయ వైఫల్యంపై శ్రీలంక పౌరులు తిరుగుబాటు చేశారు. గొటబయ రాజీనామా చేయాలంటూ శనివారం అధ్యక్షుడి భవనాన్ని ఆందోళనకారులు ముట్టడించారు. అంతకు ముందే ఆర్మీ అధికారులు గొటబయను మరో ప్రాంతానికి తరలించారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు ఇటీవలే ప్రధాని పదవి చేపట్టిన విక్రమసింఘే కూడా పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.
ఆకలి మంటల ఆగ్రహ జ్వాలలు శ్రీలంక అధ్యక్ష భవనాన్ని తాకాయి. తుపాకీ కాల్పులు, టియర్ గ్యాస్ గోళాలు, నీటి ఫిరంగులు కూడా ఆ మంటల ధాటిని నిలువరించలేక చేతులెత్తేశాయి. కడుపు మండిన లక్షలమంది శ్రీలంక ప్రజలు ఒక్కుమ్మడిగా అధ్యక్ష భవనాన్ని చుట్టుముట్టారు. పోలీసులు, సైన్యం అడ్డుగోడలను బద్దలుకొట్టి సౌధంలోకి చొచ్చుకుపోయారు. దీంతో ఇంతకాలం అధ్యక్ష పీఠాన్ని పట్టుకొని వేలాడిన దేశాధ్యక్షుడు గొటబయ రాజపక్స మూటాముల్లె సర్దుకొని పారిపోయారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు ఇటీవలే ప్రధాని పదవి చేపట్టిన సీనియర్ నేత రణిల్ విక్రమసింఘే కూడా తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు శనివారం సాయంత్రం ప్రకటించారు. అధ్యక్షుడి కాన్వాయ్ కొలంబో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు వైపు వెళ్తున్న వీడియోలు సోషల్మీడియాలో దర్శనమివ్వటంతో గొటబయ దేశం విడిచి పారిపోతున్నారనే ప్రచారం మొదలయ్యింది.
శ్రీలంక చరిత్రలోనే ఎన్నడూ లేనంత ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్న ఆ దేశ ప్రజలు, అధ్యక్షుడు గొటబయ రాజపక్స పదవి నుంచి దిగిపోవాలని కొన్ని నెలలుగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. సమీప భవిష్యత్తులోనూ పరిస్థితులు మెరుగుపడే అవకాశం లేదని, సంక్షోభం మరింత తీవ్రం అవుతుందని కొత్త ప్రధాని రణిల్ విక్రమసింఘే ప్రకటించటంతో అప్పటికే నిస్ఫృహలో ఉన్న ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకొన్నది. శనివారం అధ్యక్ష భవనాన్ని ముట్టడించేందుకు నిరసనకారులు పిలుపునిచ్చారు. ఈ ఆందోళనను నిలువరించాలని పోలీసులు కోర్టుకు వెళ్లగా.. తాము జోక్యం చేసుకోబోమని న్యాయస్థానం ప్రకటించింది. దీంతో దేశం నలుమూలల నుంచి లక్షలమంది ప్రజలు బస్సులు, లారీలు, రైళ్లలో రాజధాని కొలంబోకు శుక్రవారమే చేరుకొన్నారు. వారిని నిలువరించేందుకు సైన్యం, పోలీసులు ఎంత ప్రయత్నించినప్పటికీ లాభం లేకపోయింది. శనివారం ఉదయం నాలుగువైపుల నుంచి అధ్యక్ష భవనాన్ని చుట్టిముట్టి లోపలికి చొచ్చుకెళ్లారు. కొందరు సైనికులు కూడా ఆందోళనకారులతో కలువటంతో పరిస్థితి పూర్తిగా అదుపుతప్పింది. ఆందోళనలు అదుపు తప్పవచ్చని పోలీసులు ముందుగానే తెలుపటంతో అధ్యక్షుడు గొటబయ శుక్రవారం రాత్రే అధికార నివాసం వీడి పారిపోయినట్టు తెలిసింది. అధ్యక్షుడి లగేజీకి సంబంధించి సూట్కేసులు నేవీ షిప్పులోకి ఎక్కిస్తున్న వీడియోలు వైరల్ అయ్యాయి. ఆయన ఎక్కడ ఉన్నారో తెలియట్లేదు. అయితే 13న రాజీనామా చేయనున్నట్టు గొటబయా ప్రకటించారు.
ప్రధాని ఇంటికి నిప్పు
పరిస్థితి చేయిదాటిపోవటంతో తాత్కాలిక ప్రధాని రణిల్విక్రమ సింఘే శనివారం క్యాబినెట్ సమావేశం ఏర్పాటుచేశారు. అనంతరం పదవికి రాజీనామా చేశారు. అంతకుముందు అధ్యక్ష భవనాన్ని ముట్టడించిన తర్వాత ఆందోళనకారులు ప్రధాని రణిల్ ప్రైవేటు నివాసాన్ని కూడా ముట్టడించి నిప్పు పెట్టారు.
మొన్న అన్న.. నేడు తమ్ముడు
శ్రీలంకలో అధికారం మొత్తం రాజపక్స కుటుంబం చేతుల్లోనే ఉన్నది. గొటబయ రాజపక్స అధ్యక్షుడు.. ఆయన అన్న మహీంద రాజపక్స మొన్నటి వరకు ప్రధాని, మరో ఇద్దరు సోదరులతోపాటు వారి పిల్లలు కూడా కీలకమైన క్యాబినెట్ మంత్రులు, వివిధ సంస్థల అధిపతులుగా ఉన్నారు. వీరి నిరంకుశ పాలన.. వివాదాస్పద, అసంబద్ధ నిర్ణయాలతో దేశాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టారు. దీంతో గొటబయ, మహీంద అధికారం నుంచి దిగిపోవాలని దేశంమొత్తం ఏకతాటిపైకి వచ్చి కొన్ని నెలలుగా డిమాండ్ చేస్తున్నది. గత మేలో ప్రధాని మహీంద ఇంటిని నిరసనకారులు చుట్టుముట్టి కాల్చి బూడిద చేశారు. నిరసనలు అదుపుతప్పటంతో మే 10న మహీంద రాజపక్స నివాసాన్ని వదిలి పారిపోయారు. ఇప్పుడు గొటబాయ అదే పని చేశారు.
స్విమ్మింగ్ ఫూల్లో ఈత కొడుతూ..కిచెన్లో తింటూ..
అధ్యక్ష భవనాన్ని ముట్టడించిన వేలమంది నిరసనకారులు శ్రీలంక జాతీయ పతాకాలను చేతబూని గొటబయకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కొందరు భవనంలోని స్విమ్మింగ్పూల్లో ఈత కొట్టారు. మరికొందరు అధ్యక్ష భవనం కిచెన్లోకి ప్రవేశించి అక్కడి ఆహార పదార్థాలను తింటూ కనిపించారు. ఈ వీడియోలు సోషల్మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
గొటబయ రాజీనామా చేస్తే..
అధ్యక్ష భవనం నుంచి పారిపోయిన గొటబయ 13న అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఒకవేళ ఆయన పదవి నుంచి తప్పుకొంటే పరిస్థితి ఏమిటన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ప్రధాని పదవి కూడా ఖాళీ కావటంతో పాలన ఎలా అన్నదానిపై సర్వత్రా ఆసక్తిగా మారింది. శ్రీలంక రాజ్యాంగం ప్రకారం అధ్యక్ష పదవి పూర్తికాలం ముగియకముందే ఖాళీ అయితే పార్లమెంటు సభ్యుల్లో ఎవరో ఒకరిని అధ్యక్షుడిగా ఆ దేశ పార్లమెంటు ఎన్నుకొంటుంది. పదవి ఖాళీ అయిన నెలలోపు కొత్త అధ్యక్షుడిని ఎన్నుకొనే ప్రక్రియ మొదలుపెట్టాలి. సాధారణంగా అయితే అధ్యక్షుడు రాజీనామా చేస్తే ప్రధాని తాత్కాలికంగా అధ్యక్షుడిగా కొనసాగుతారు. ఇప్పుడు రెండు పదవులు ఖాళీ కావటంతో ఏం చేయాలన్నదానిపై ఆ దేశ రాజ్యాంగ నిపుణులు మల్లగుల్లాలు పడుతున్నారు.