కొలంబో, ఏప్రిల్ 29: దేశంలో నెలకొన్న ఆర్థిక సంక్షోభం దృష్ట్యా ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ప్రజాగ్రహం వ్యక్తమవుతున్న నేపథ్యంలో శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజపక్స కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆర్థిక సంక్షోభం కారణంగా ఏర్పడిన రాజకీయ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు ప్రధానిగా ఉన్న సోదరుడు మహింద రాజపక్సను మార్చేందుకు అంగీకారం తెలిపారని, ఈ మేరకు మధ్యంతర ప్రభుత్వ ప్రతిపాదనలో పేర్కొన్నారని ఎస్ఎల్ఎఫ్పీ నేత, మాజీ అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన శుక్రవారం పేర్కొన్నారు. అధ్యక్షుడితో భేటీ అనంతరం మైత్రిపాల మీడియాతో మాట్లాడుతూ కొత్త ప్రధాని ఎంపిక కోసం నేషనల్ కౌన్సిల్ ఏర్పాటుకు గొటబయ సంసిద్ధత వ్యక్తం చేశారని, పార్లమెంట్లోని అన్ని పార్టీలతో కూడిన క్యాబినెట్ను ఏర్పాటు చేసేందుకు అంగీకరించారని తెలిపారు.
మధ్యంతర ప్రభుత్వ ఏర్పాటుకు ప్రతిపక్షాలతో కలిసి మెజార్టీ నిరూపించుకోవాలని అధ్యక్షుడు అసమ్మతి బృందాన్ని కోరినట్టు సమాచారం. అధికార కూటమి ఎంపీగా ఉన్న మైత్రిపాల సిరిసేన, ఈనెల ప్రారంభంలో అసమ్మతి జెండా ఎగురవేసి 40 మంది ఇతర ఎంపీలతో కలసి బయటకు వచ్చారు. అయితే ప్రధాని మహింద రాజపక్స అధికార ప్రతినిధి రోహన్ వెలివిట్ట మాట్లాడుతూ ప్రధానిని తొలగించే ఉద్దేశం గురించి అధ్యక్షుడు తెలియజేయలేదని, అటువంటి చర్య తీసుకుంటే నిర్ణయం ప్రకటిస్తారని పేర్కొన్నారు.