కొలంబో : అప్పుల ఊబిలో చిక్కుకుపోయి ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతున్న పొరుగుదేశం శ్రీలంకకు జీ7 దేశాలు అండగా నిలిచాయి. సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు జీ7 దేశాల ఆర్థిక మంత్రులు శ్రీలంకను గట్టెక్కించేందుకు సహాయ సహకారాలు అందజేస్తామని ప్రకటించారు. ఈ నిర్ణయంపై లంక ప్రధాని రణిల్ విక్రమసింఘే స్వాగతించారు. 1948లో స్వాతంత్ర్యం అనంతరం తొలిసారిగా లంక అత్యంత తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. విదేశీ మారకద్రవ్యం కొరత కారణంగా దేశీయంగా భారీగా ధరల పెరుగుదలకు దారి తీసింది.
పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్, విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన బొగ్గు కొరత ఏర్పడింది. ఈ క్రమంలోనే గ్రూప్ ఆఫ్ సెవెన్ (G7) దేశాలు శ్రీలంకకు సహాయం చేస్తామని ప్రకటించాయి. జీ7 దేశాల్లో యూకే, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, అమెరికా ఉన్నాయి. ఇదిలావుండగా శ్రీలంకలో కొనసాగుతున్న ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో జపాన్ ప్రభుత్వం శుక్రవారం 1.5 మిలియన్ డాలర్ల నిధులను ప్రకటించింది. ఈ నిధులను యునైటెడ్ నేషన్స్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాం (WFP) పిల్లలు, కుటుంబాలకు అవసరమైన ఆహారం అందించేందుకు వినియోగించనున్నది.