Sri Lanka Crisis | శ్రీలంక తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. ద్వీప దేశ ప్రజలు వీధుల్లోకి వచ్చి నిరసన తెలుపుతున్నారు. అయితే, 9వ తేదీ శ్రీలంక దేశానికి ఇబ్బందికరంగా తయారైంది. వరుసగా గత నాలుగు నెలలుగా 9వ తేదీ రోజునే దేశానికి కొత్త కష్టాలు వచ్చాయి. శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్స రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఏప్రిల్ 9న ఆయన కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాలు మొదలయ్యాయి. ఆ తర్వాత మే 9న అప్పటి శ్రీలంక అధ్యక్షుడు మహింద రాజపక్స తన పదవికి రాజీనామా చేశారు. అనంతరం జూన్ 9న ఆర్థిక మంత్రి బలిస్ రాజపక్స పదవి నుంచి వైదొలిగారు. ప్రస్తుత అధ్యక్షుడు గోటబయ పదవి నుంచి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు. అలాగే ప్రస్తుతం లంక ప్రధాని రణిల్ విక్రమ సింఘే సైతం పదవికి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు.
శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం తీవ్ర రూపం దాల్చిన అనంతరం మే 9న రాజకీయంగా కీలక మార్పులు చోటు చేసుకున్నది. ఆ రోజున అప్పటి ప్రధాని మహింద రాజపక్స తన పదవికి రాజీనామా చేశారు. అనంతరం నెల గడిచే సరికి కంటే జూన్ 9న ఆర్థిక మంత్రి బాసిల్ రాజపక్సే సైతం తన పదవిని కోల్పోవాల్సి వచ్చింది. మరింత తీవ్రమైన ఆందోళనలు ఈ నెల 9న శనివారం ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. అధ్యక్షుడు గొటబయ రాజపక్స తన అధికారిక నివాసం నుంచి పరారయ్యారు. ఆ తర్వాత పదవికి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు. అదే రోజుసాయంత్రం వరకు ప్రధాని రణిల్ విక్రమ సింఘే సైతం రాజీనామా చేయనున్నట్లు వెల్లడించారు. ఆయనతో పాటు మరో ఇద్దరు కేబినెట్ మంత్రులు హరీన్ ఫెర్నాండో, మనుష్ నానయక్కరా తమ పదవులకు రాజీనామా చేశారు.
శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్సే ఈ నెల 13న తన రాజీనామాను సమర్పించనున్నారు. శ్రీలంక పార్లమెంట్ స్పీకర్ మహింద యాపా అభయవర్ధనే శనివారం రాత్రి ఈ విషయాన్ని వెల్లడించారు. శనివారం సాయంత్రం జరిగిన అఖిలపక్ష నేతల సమావేశం అనంతరం అభయవర్ధనే తన రాజీనామాను కోరుతూ లేఖ రాయడంతో అధ్యక్షుడు రాజపక్సే ఈ నిర్ణయాన్ని పార్లమెంట్ స్పీకర్కు వెల్లడించారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై అభయవర్ధనే అధ్యక్షుడికి లేఖ రాశారు. కొత్త వారసుడిని నియమించే వరకు అభయవర్ధనే తాత్కాలిక అధ్యక్షుడిగా కొనసాగేందుకు రాజపక్స, ప్రధాని రణిల్ విక్రమ సింఘే తక్షణమే రాజీనామా చేయాలని పార్టీ నాయకులు కోరారు. విక్రమసింఘే ఇప్పటికే రాజీనామా కోరికను వ్యక్తం చేశారు. అభయవర్ధనే లేఖకు గోటబయ సమాధానమిస్తూ జూలై 13న తాను పదవీవిరమణ చేస్తానని చెప్పారు.
ఆర్థిక సంక్షోభానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పెద్దఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో నిరసనకారులు ప్రధాని రణిల్ విక్రమసింఘే వ్యక్తిగత నివాసంలోకి చొచ్చుకువెళ్లి నిప్పుపెట్టారు. అఖిలపక్ష ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు విక్రమసింఘే తన పదవికి రాజీనామా చేసేందుకు ముందుకొచ్చిన కొన్ని గంటలకే ఈ ఘటన చోటుచేసుకుంది. భద్రతా సిబ్బంది, ప్రదర్శనకారుల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడంతో ప్రదర్శనకారులు విక్రమసింఘే నివాసంలోకి ప్రవేశించి నిప్పుపెట్టారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించినప్పటికీ నిరసనకారులు తప్పించుకొని వెళ్లి ప్రధాని నివాసానికి నిప్పుపెట్టారు.
శనివారం నాటి నిరసనలకు ముందే అధ్యక్షుడు గోటబయ తన అధికారిక నివాసం నుంచి పరారయ్యారు. ఆ తర్వాత వేలాది మంది నిరసనకారులు అధికారిక నివాసంపై దాడి చేశారు. మార్చి నుంచే గోటబయ ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. అధ్యక్షుడు రాజీనామా చేయాలంటూ నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఏప్రిల్లో తన కార్యాలయాన్ని ఆక్రమించేందుకు నిరసనకారులు యత్నించగా.. ఆయన రాష్ట్రపతి భవన్ను తన నివాసంగా, కార్యాలయంగా వినియోగించుకుంటున్నారు.
శ్రీలంక మునుపెన్నడూ లేని విధంగా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. 22 మిలియన్ల జనాభా ఉన్న దేశం ఏడు దశాబ్దాల్లో అత్యంత దారుణమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నది. విదేశీ మారకద్రవ్యం కొరత తీవ్రంగా వేధిస్తున్నది. ఇంధనం, ఇతర అవసరమైన నిత్యావసర వస్తువుల దిగుమతుల కోసం విదేశీ మారకాన్ని ద్వీప దేశం చెల్లించలేకపోతున్నది. ఫలితంగా పెట్రోల్, డీజిల్ ధరలు, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. దీంతో ప్రజల నుంచి ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.