కొలంబో: శ్రీలంక మాజీ ప్రధాని మహింద రాజపక్స, ఆయన కుమారుడు నమల్, మిత్రపక్ష పార్టీ నేతలు దేశం విడిచి వెళ్లవద్దని శ్రీలంక కోర్టు ఆదేశించింది. ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆ దేశంలో నిరసనలు, హింసాత్మక ఘటనలు జరుగుతుండటంతో వారు దేశం విడిచి వెళ్లకుండా నిషేధం విధించింది. అలాగే సోమవారం రాజధాని కొలంబోలో శాంతియుతంగా నిరసన చేస్తున్న వారిపై సామూహిక దాడులకు పాల్పడిన ఘటనలపై దర్యాప్తు జరుపాలని పోలీసులను కోర్టు ఆదేశించింది. ఈ హింసాకాండలో అధికార పార్టీ ఎంపీ సహా తొమ్మిది మరణించారు. అధికార పార్టీ ఎంపీలు, మిత్ర పక్ష పార్టీల నేతల ఇళ్లకు ఆందోళనకారులు నిప్పుపెట్టారు.
ఈ పరిణామాల నేపథ్యంలో రాజపక్స, ఆయన మద్దతుదారుల అరెస్ట్ కోసం వారెంట్ జారీ చేయాలని కోరుతూ శ్రీలంక కోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. అయితే ఈ పిటిషన్ను కోర్టు తిరస్కరించింది. కాగా, ప్రభుత్వ వ్యతిరేక నిరసనలను అణిచివేసేందుకు సోమవారం రాజపక్స మద్దతుదారులైన సుమారు మూడు వేల మందిని బస్సుల్లో నిరసన జరుగుతున్న ప్రాంతానికి తరలించారు. దీంతో ప్రశాంతంగా నిరసనలు చేస్తున్న వారిపై రాజపక్స మద్దతుదారులు దాడులు చేశారు. ప్రభుత్వ భద్రతా సిబ్బంది కూడా నిరసనకారులపై విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా తలెత్తిన హింసాకాండలో బౌద్ధ సన్యాసులు, చర్చి ఫాదర్లతో సహా సుమారు 225 మంది గాయపడి ఆసుపత్రి పాలయ్యారు.