కొలంబో: ఆర్థిక సంక్షోభంలో పూర్తిగా కూరుకుపోయిన శ్రీలంకలో (Sri Lanka)ప్రజా నిరసనలు ఉద్ధృతమయ్యాయి. దీంతో వాటిని నిలువరించడానికి ఇప్పటికే దేశవ్యాప్తంగా అత్యవసర పరిస్థితి అమలుచేస్తున్న ప్రభుత్వం.. తాజాగా సామాజిక మాధ్యమాలపై నిషేధం విధించింది. ఈ మేరకు శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఆదేశాలు జారీచేసింది. దీంతో దేశంలో ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్, వాట్సప్, యూట్యూబ్ సేవలు నిలిచిపోయాయి. తప్పుడు సమాచారాన్ని అరికట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
దేశంలో నిత్యావసరాల ధరలు చుక్కలను తాకడంతో అధ్యక్షుడు రాజపక్సకు వ్యతిరేకంగా ప్రజలు ఆందోళనలకు దిగారు. దీంతో దేశవ్యాప్త ఎమర్జెన్సీ విధించారు. భద్రతా బలగాలకు అపరిమిత అధికారాలనిచ్చారు. నిరసన ప్రదర్శనలు ఎవరు నిర్వహించినా అదుపులోకి తీసుకోవాలని ఆదేశించారు. ప్రజల భద్రత, అత్యవసర సేవల కోసం, నిత్యావసర వస్తువుల సరఫరాలో ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండేందుకే ఎమర్జెన్సీ నిర్ణయం తీసుకొన్నట్టు రాజపక్స పేర్కొన్నారు. ఎమర్జెన్సీ శుక్రవారం నుంచే అమల్లోకి వచ్చింది.
దీంతోపాటు 36 గంటల దేశవ్యాప్త కర్ఫ్యూ విధించారు. కర్ఫ్యూ శనివారం సాయంత్రం 6 గంటల నుంచి ఇది అమల్లోకి వచ్చింది. సోమవారం ఉదయం 6 గంటల వరకు అమల్లో ఉంటుంది. నిత్యావసరాల కోసం తప్ప ప్రజలు దేనికీ బయటకు రావొద్దని అధికారులు ఆదేశించారు.