ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నెట్ఫ్లిక్స్ సిరీస్ ‘స్క్విడ్ గేమ్’. ఇది ఎంత పెద్ద హిట్ అయిందో వేరే చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచం మొత్తం ఈ సస్పెన్స్ థ్రిల్లర్ను ఆస్వాదించినా ఉత్తర కొరియా ప్రజలకు ఆ అవకాశం దక్కలేదు. అక్కడ ప్రభుత్వం ఆమోదించిన టీవీ ఛానెళ్లు, ప్రోగ్రాములు మాత్రమే టెలికాస్ట్ అవుతాయన్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే ఒక వ్యక్తి చైనా వెళ్లినప్పుడు స్క్విడ్ గేమ్ను యూఎస్బీ ఫ్లాష్ డ్రైవ్లో ఎక్కించుకున్నాడు. ఆ తర్వాత స్వదేశానికి వచ్చిన తర్వాత దాన్ని చూశాడు. వేరేవాళ్లు అడిగితే వాళ్లకు దాన్ని అమ్మాడట. ఈ విషయం తెలిసిన అధికారులు ‘స్క్విడ్ గేమ్’ స్మగుల్ చేసినందుకు సదరు వ్యక్తిని అరెస్టు చేశారు.
అంతేకాదు అతనికి మరణశిక్ష విధించారట. అలాగే దీన్ని కొని చూసిన విద్యార్థికి జీవితఖైదు విధించినట్లు రేడియో ఫ్రీ ఆసియా అనే వార్తాసంస్థ వెల్లడించింది. విద్యార్థులు ఈ గేమ్ చూస్తూ కనిపించడంతోనే ఈ విషయం మొత్తం బయటకు వచ్చినట్లు సమాచారం.