కీవ్: రష్యా-ఉక్రెయిన్ స్నేహానికి చిహ్నంగా ఉన్న సోవియట్ కాలం నాటి భారీ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఉక్రెయిన్పై రష్యా యుద్ధం నేపథ్యంలో రాజధాని కీవ్లోని పురాతన స్నేహ విగ్రహం తొలగింపునకు కీవ్ నగర మేయర్ విటాలి క్లిట్ష్కో ఆదేశించారు. సోవియట్ యూనియన్ 60వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని 1982లో ఏర్పాటు చేసిన జెయింట్ టైటానియం ‘పీపుల్స్ ఫ్రెండ్షిప్ ఆర్చ్’ వద్ద రష్యా, ఉక్రెయిన్ కార్మికులు చేతులు కలిపినట్లు ఉన్న 27 అడుగుల కాంస్య విగ్రహాన్ని అక్కడి నుంచి తొలగించారు. ఈ క్రమంలో రష్యా కార్మికుడి తల తెగి పడింది. పలువురు ఉక్రెయిన్ పౌరులు ఈ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. రష్యాతో ఇక స్నేహం లేదని కొందరు పేర్కొన్నారు. ధ్వంసమైన ఈ విగ్రహం ఇరు దేశాల మధ్య నిజమైన సంబంధాలకు అద్దం పడుతున్నదని వ్యాఖ్యానించారు.
కాగా, లక్షలాది మంది ఉక్రేనియన్ల సాధారణ జీవితాన్ని, ఐరోపాలో శాంతిని రష్యా నాశనం చేసిందని కీవ్ నగర మేయర్ విటాలి విమర్శించారు. అందుకే రష్యా-ఉక్రెయిన్ స్నేహ విగ్రహాన్ని తొలగించాలని నిర్ణయించినట్లు తెలిపారు. అతికష్టం మీద ఈ విగ్రహాన్ని మంగళవారం పూర్తిగా తొలగించినట్లు చెప్పారు. ‘పీపుల్స్ ఫ్రెండ్షిప్ ఆర్చ్’ పేరును ‘ఉక్రేనియన్ పీపుల్స్ ఫ్రీడమ్ ఆర్చ్’గా మార్చేందుకు ప్రతిపాదించినట్లు తెలిపారు. అలాగే ఉక్రెయిన్ జాతీయ జెండా రంగులతో ఆ కూడలిని అందంగా తీర్చిదిద్దుతామని వెల్లడించారు.
You don't kill your brother.
You don't rape your sister.
You don't destroy your friend's country.
That's why today we dismantled this monument once created as a sign of friendship between Ukraine and Russia.#FreeUkraine #WeAreAllUkrainians #StandWithUkraine #StopTheWar pic.twitter.com/HQI0W9XNS8— Klitschko (@Klitschko) April 26, 2022