సియోల్: ఉత్తర కొరియా, దక్షిణ కొరియాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. శుక్రవారం ఉత్తర కొరియాకు చెందిన సుమారు 180 యుద్ధ విమానాలు ఇరు దేశాల సరిహద్దు గగనతలంలో ఎగిరాయి. మిలిటరీ డిమార్కేషన్ లైన్ (ఎండీఎల్)కి ఉత్తరంగా 20 కిలోమీటర్ల దూరంలోని వ్యూహాత్మక సరిహద్దు రేఖ ప్రాంతంలో విన్యాసాలు నిర్వహించాయి. వీటిని గుర్తించిన దక్షిణ కొరియా వెంటనే అప్రమత్తమైంది. 80 ఫైటర్ జెట్లను రంగంలోకి దించింది. వీటిలో ఎఫ్-35 ఏ స్టెల్త్ ఫైటర్స్ కూడా ఉన్నాయి. అలాగే అమెరికా, దక్షిణ కొరియా కలిసి 240 యుద్ధ విమానాలతో విన్యాసాలు నిర్వహించాయి.
ప్యోంగ్యాంగ్ గగనతలంలో దాదాపు 180 ఉత్తర కొరియా యుద్ధ విమానాలను తమ మిలిటరీ గుర్తించిందని దక్షిణ కొరియా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ తెలిపారు. దీంతో ఎఫ్-35ఏ జెట్లతో సహా 80 ఫైటర్ జెట్లు గాల్లోకి ఎగిరాయని చెప్పారు. ఎలాంటి దాడినైనా ఎదుర్కొనేందుకు అమెరికాతో కలిసి జాయింట్ డ్రిల్స్లో పాల్గొన్న యుద్ధ విమానాలు కూడా సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు.
కాగా, అమెరికాతో కలిసి దక్షిణ కొరియా గురువారం నిర్వహించిన వాయు విన్యాసాలపై ఉత్తర కొరియా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో గత రాత్రి సుమారు 80 రౌండ్ల ఆర్టిలరీని పేల్చింది. అలాగే పలు క్షిపణులను సముద్రంలోకి లాంచ్ చేసింది. అయితే అది ప్రయోగించిన ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి విఫలమైనట్లు సమాచారం. మరోవైపు ఉత్తర కొరియా కవ్వింపుల నేపథ్యంలో సంయుక్త వాయు విన్యాసాలను కొనసాగించాలని అమెరికా, దక్షిణ కొరియా నిర్ణయించాయి.