జోహన్నస్బర్గ్: ఒమిక్రాన్ కరోనా వేరియంట్ ప్రబలుతున్న నేపథ్యంలో.. దక్షిణాఫ్రికా నుంచి వస్తున్న విమానాలపై ప్రపంచ దేశాలు ఆంక్షలు విధిస్తున్న విషయం తెలిసిందే. అయితే తమ దేశ విమానాలపై ఆంక్షలు విధించడాన్ని సౌతాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా ఖండించారు. ఆ చర్యల పట్ల ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆంక్షలు అన్యాయమన్నారు. అర్జెంట్గా ఆ ఆంక్షలను ఎత్తివేయాలని ఆయన పిలుపునిచ్చారు. దక్షిణాఫ్రికా నుంచి వస్తున్న ప్రయాణికులపై బ్రిటన్, ఈయూ, అమెరికా దేశాలు ఆంక్షలు విధించాయి. ఒమిక్రాన్ వేరియంట్ ఆందోళనకరంగా ఉందని డబ్ల్యూహెచ్వో ప్రకటించిన తర్వాత పలు దేశాలు దక్షిణాఫ్రికా విమానాలపై నిబంధనలు పెట్టాయి. ఒమిక్రాన్ వేరియంట్ తొలుత సౌతాఫ్రికాలో నమోదు అయిన విషయం తెలిసిందే.