కీవ్ : రష్యా దమనకాండలో ఉక్రెయిన్ మహిళలపై అరాచకాలు జరుగుతున్న తీరు కలిచివేస్తోంది. ఉక్రెయిన్ మహిళలపై లైంగిక దాడులకు తెగబడి ఆపై వారిని రష్యన్ బలగాలు కాల్చివేస్తున్న ఉదంతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఉక్రెయిన్ రాజధాని కీవ్లోని సామూహిక సమాధులలో మృతదేహాలకు శవపరీక్షలు నిర్వహించగా, పలువురు ఉక్రేనియన్ మహిళలను చంపడానికి ముందు రష్యా దళాలు లైంగిక దాడికి పాల్పడ్డాయని ఆ నివేదికల్లో వెల్లడైనట్టు వైద్యులు తెలిపారు.
మహిళలను కాల్చి చంపేందుకు ముందు వారిపై దళాలు అత్యాచారాలకు తెగబడ్డాయని కొన్ని కేసులను తాము పరిశీలించగా తేటతెల్లమైందని ఉక్రెయిన్కు చెందిన ఫోరెన్సిక్ డాక్టర్ వ్లాదిస్లవ్ పెరోవ్స్కీ పేర్కొన్నారు. పెరోవ్స్కీ తన సహచర వైద్యులతో కలిసి దాదాపు పన్నెండుకు పైగా శవపరీక్షలు నిర్వహించారు. తామింకా వందల కొద్దీ శవపరీక్షలు నిర్వహించి వివరాలు రాబట్టాల్సి ఉన్నందున మరింత సమాచారం ఇవ్వలేమని చెప్పారు. మహిళలపై లైంగిక దాడి జరిగిందనే వివరాలు తమ కార్యాలయానికి వచ్చాయని కీవ్ ప్రాంత సీనియర్ ప్రాసిక్యూటర్ ఒలె తలెంకో తెలిపారు.
మహిళా బాధితులపై లైంగిక దాడులు జరిగాయా అనే కోణంలో సమగ్ర వివరాలను సేకరించేందుకు ఫోరెన్సిక్ వైద్యులు కొందరికి ప్రత్యేక బాధ్యతలు అప్పగించామని చెప్పారు. బాధితుల వయసు, ప్రాంతం తదితర అన్ని అంశాలతో సమాచారాన్ని క్రోడీకరిస్తున్నామని అన్నారు. లైంగిక వేధింపులు, అత్యాచారాల ఆనవాళ్లను పసిగట్టడం సులభం కాదని, మహిళలను కాల్చిచంపే ముందు రష్యన్ బలగాలు వారిపై లైంగిక దాడులకు పాల్పడ్డాయనేందుకు కొన్ని కేసుల్లో తాము ఆధారాలను సేకరిస్తున్నామని చెప్పారు.