టోక్యో: జపాన్లో షింకన్సెన్ బుల్లెట్ రైలు(Bullet Train) అందరికీ తెలిసిందే. కానీ ఆ రైలు ఆలస్యం కావడం చాలా అరుదు. కొన్ని సందర్భాల్లో ఆ రైలు కూడా డిలే అవుతుంది. అయితే ఓ పాము ఆ రైలులో కనిపించడంతో షింకన్సెన్ సర్వీసును నిలిపివేశారు. మంగళవారం ఈ ఘటన జరిగింది. సుమారు 16 ఇంచులు పొడుగు ఉన్న సర్పాన్ని బుల్లెట్ రైలులో గుర్తించారు. నగోయా, టోక్యో మధ్య ఉన్న రూట్లో దాన్ని గుర్తించారు. దీంతో రైలును 17 నిమిషాల పాటు ఆపేశారు.
అయితే అది విష సర్పమా లేక సాధారణ సర్పమా అన్న విషయం తెలియలేదు. ప్రయాణికులకు ఎటువంటి గాయాలు కాలేదని సెంట్రల్ జపాన్ రైల్వే కంపెనీ వెల్లడించింది. షింకన్సెన్ కస్టమర్లు రైలులోకి చిన్నపాటి పెంపుడు శునకాలను, పిల్లులు, ఇతర జంతువులను తీసుకువెళ్లవచ్చు. కానీ ఆ రైలులో పాములను తీసుకెళ్లడం అనుమతి లేదు.
కానీ ఓ స్టేషన్ వద్ద ఓ సర్పం ఎలా ఆ రైలులోకి వచ్చిందో తెలియదని అధికారులు చెబుతున్నారు. ప్యాసింజెర్ బ్యాగేజీని చెక్ చేయమని రైల్వే అధికారి తెలిపారు. పాము కనిపించిన రైలునే ఒసాకా నుంచి ముందుగా పంపించాలనుకున్నారు. కానీ కంపెనీ మాత్రం మరో రైలును తీసుకువచ్చి ప్రయాణికుల్ని పంపించింది. దీని వల్ల 17 నిమిషాల డిలే జరిగింది.