వాషింగ్టన్: భారత సంతతి వ్యక్తి (Indian Origin Man) ఉబర్ క్యాబ్ సేవల ద్వారా వందలాది మంది భారతీయులను అక్రమంగా అమెరికాలోకి తరలించాడు. ఐదు లక్షలకు పైగా అమెరికా డాలర్లను అక్రమ పద్ధతుల్లో సంపాదించాడు. ఈ నేరానికిగాను ఆ వ్యక్తికి మూడేళ్లకుపైగా జైలు శిక్షను అమెరికా కోర్టు విధించింది. ఈ మేరకు మంగళవారం తీర్పు ఇచ్చింది. కాలిఫోర్నియాలో నివసించే 49 ఏళ్ల రాజిందర్ పాల్ సింగ్ అలియాస్ జస్పాల్ గిల్, మరి కొందరితో కలిసి 800 మందికి పైగా భారతీయులను అక్రమంగా అమెరికాలోకి తరలించాడు. దీని కోసం ఉబర్ సంస్థ క్యాబ్ సేవలను వినియోగించాడు.
కాగా, 2018 జూలై నుంచి 2022 మే వరకు రాజిందర్ పాల్ సింగ్ ఈ అక్రమాలకు పాల్పడ్డాడు. కెనడా నుంచి ఉత్తర సరిహద్దు మీదుగా సీటెల్తోపాటు వాషింగ్టన్ స్టేట్లోని పలు ప్రాంతాలకు ఉబర్ క్యాబ్ల ద్వారా భారతీయులను అక్రమంగా తరలించాడు. నాలుగేళ్లలో 600కు పైగా ఉబర్ ట్రిప్లను వినియోగించాడు. ఈ నేరాలకు సంబంధించి 17 ఉబర్ ఖాతాలను అమెరికా పోలీసులు గుర్తించారు. భారతీయుల అక్రమ తరలింపునకుగాను ఈ ఖాతాల్లో 80,000కు పైగా అమెరికా డాలర్లను ఛార్జీలుగా వసూలు చేసినట్లు దర్యాప్తులో తెలుసుకున్నారు.
మరోవైపు రాజిందర్ పాల్ సింగ్ ఇంట్లో 45,000 అమెరికా డాలర్ల నగదుతో పాలు పలు ఫొర్జరీ పత్రాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాషింగ్టన్కు భద్రతాపరమైన ముప్పు కలిగించినట్లు కోర్టు ఆరోపించింది. అలాగే అమెరికాలోకి అక్రమంగా స్మగ్లింగ్ చేసిన భారతీయులను కూడా అతడు ముప్పులోకి పడేసినట్లు పేర్కొంది. మనీలాండరింగ్ అభియోగాలకు కూడా పాల్పడినట్లు ఆరోపించింది. తన నేరాన్ని ఒప్పుకున్న సింగ్కు కోర్టు 45 నెలలు జైలు శిక్ష విధించింది.
కాగా, రాజిందర్ సింగ్ కాలిఫోర్నియాలో చట్టబద్ధంగా నివసించడం లేదని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ నేపథ్యంలో జైలు శిక్ష ముగిసిన తర్వాత అతడ్ని అమెరికా నుంచి తిప్పి పంపుతామని ఆ దేశ పోలీసులు వెల్లడించారు.