లండన్: ధూమపానాన్ని అరికట్టడానికి యునైటెడ్ కింగ్డమ్ కఠిన చట్టాన్ని తెస్తున్నది. భవిష్యత్తు తరం ధూమపానానికి అలవాటు పడకుండా పొగాకు, ఈ-సిగరెట్ల వాడకాన్ని నిషేధిస్తూ బిల్లును పార్లమెంట్లో ఆమోదించింది. కింగ్ చార్లెస్-3 లాంఛనంగా దీనికి ఆమోదం తెలిపాక చట్టంగా మారుతుంది. ఈ బిల్లు ప్రకారం 2008 తర్వాత జన్మించిన వారు పొగాకు ఉత్పత్తులు కొనడం నిషేధం.
ఈ నిషేధం 2027 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుంది. స్కూళ్లు, దవాఖానలు, పిల్లలాడుకొనే ప్రదేశాల్లో ధూమపానాన్ని పూర్తిగా నిషేధిస్తారు. చాలా ఇండోర్ పబ్లిక్ స్థలాల్లో ఈ-సిగరెట్ల ధూమపానాన్ని నియంత్రిస్తారు. 18 ఏండ్ల లోపు వారు ప్రయాణించే వాహనంలో ఈ-సిగరెట్లను వాడటం కూడా చట్ట విరుద్ధమవుతుంది. నికోటిన్ ప్రభావానికి ప్రజలు గురి కావడాన్ని తగ్గించడం, యువతలో దాని వినియోగాన్ని నిరుత్సాహపరచడమే ఈ చర్యల ఉద్దేశమని అధికారులు తెలిపారు. ఈ చట్టాన్ని కఠినంగా అమలు చేస్తామని చెప్పారు.