లాస్ ఏంజెల్స్ : అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. ఇదాహో రాష్ర్టంలోని రిగ్బి మిడిల్ స్కూల్లో గురువారం ఓ విద్యార్థిని కాల్పులకు పాల్పడింది. ఆరో తరగతి చదువుతున్న బాలిక తన వెంట తెచ్చుకున్న తుపాకీతో విచక్షణారహితంగా కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో ఇద్దరు విద్యార్థులు, మరొకరు స్కూల్ సిబ్బంది గాయపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. కాల్పులకు పాల్పడిన బాలికను అదుపులోకి తీసుకున్నారు. గతేడాది అమెరికాలో తుపాకీ కాల్పులకు సంబంధించిన ఘటనల్లో 43 వేల మందికి పైగా మరణించారు. ఈ మరణాల్లో కొందరు తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడిన వారు ఉన్నారు.