(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, మే 14 (నమస్తే తెలంగాణ) : రెండున్నర నెలలు గడిచినప్పటికీ పశ్చిమాసియా ఉద్రిక్తతలు చల్లారడం లేదు. హొర్ముజ్ జలసంధిపై నెలకొన్న ప్రతిష్ఠంభనతో యావత్తు ప్రపంచ దేశాలకు చమురు కష్టాలు పెరుగుతున్నాయి. అమెరికా-ఇరాన్ యుద్ధం ఇప్పట్లో ముగిసేట్టు కనిపించకపోవడంతో భవిష్యత్తులో పరిస్థితులు మరింతగా దిగజారనున్నట్టు ఇప్పటికే పలువురు ఆర్థిక నిపుణులు, పారిశ్రామికవేత్తలు హెచ్చరించారు. ఇప్పుడు ఈ జాబితాలో సింపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్ కూడా చేరారు. ఇటీవల జాతినుద్దేశించి ఆయన చేసిన ప్రసంగంలో పశ్చిమాసియా ఉద్రిక్తతలు, తదనంతర పరిణామాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. హొర్ముజ్ సంక్షోభం ఇప్పట్లో పరిష్కారమయ్యే సూచన ఎంతమాత్రం కనిపించట్లేదని వాంగ్ అన్నారు. దీని కారణంగా కొన్ని దేశాలు ఆర్థిక మాంద్యంలోకి వెళ్లిపోయే ప్రమాదమున్నదని హెచ్చరించారు. ఆ ప్రభావం సింగపూర్ మీద కూడా పడబోతున్నదని చెప్పారు. ఇంధనమే కాకుండా ఆహారం, ఎరువుల ధరలు కూడా ఆకాశాన్నంటే ప్రమాదమున్నదని పేర్కొన్నారు. ఇప్పటికిప్పుడు హొర్ముజ్ జలసంధిని తెరిచినప్పటికీ, పరిస్థితులు సానుకూలంగా మారే అవకాశం లేదని తేల్చి చెప్పారు. నెలలపాటు ఆర్థిక సంక్షోభం కొనసాగొచ్చని అంచనా వేశారు.
పశ్చిమాసియా ఉద్రిక్తతలపై కొటక్ మహీంద్రా బ్యాంకు వ్యవస్థాపకుడు ఉదయ్ కొటక్ ఇటీవల స్పందిస్తూ.. రాబోయే రోజుల్లో ఎదురయ్యే దారుణ పరిస్థితులకు భారతీయులు సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. పెట్రోల్, డీజిల్ వాహనాలు నేరుగా వాడని వారికి కూడా నిత్యావసరాల రూపంలో గల్ఫ్ దెబ్బ పడుతుందని అన్నారు. వేతనాలు పెరిగే అవకాశం లేని కుటుంబాలకు ఇది పెద్ద షాక్ కానుందని చెప్పారు. ఇక, అమెరికా-ఇరాన్ యుద్ధం కేవలం విదేశాంగ శాఖ సమస్య కాదని, భారత్ చెల్లింపుల సామర్థ్యానికి అగ్నిపరీక్ష అని భారత ముఖ్య ఆర్థిక సలహాదారు అనంత నాగేశ్వరన్ అన్నారు. పశ్చిమాసియా ఉద్రిక్తతలతో ప్రపంచ దేశాలకు ఇబ్బందులు తప్పవని, ఆర్థిక వృద్ధికి విఘాతంగా మారనున్నదని ప్రపంచ బ్యాంకు ప్రెసిడెంట్ అజయ్ బంగా హెచ్చరించారు.