కౌలాలంపూర్: మలేషియాకు చెందిన నాగేంద్రన్ కే ధర్మలింగం అనే వ్యక్తికి సింగపూర్ కోర్టు చివరి నిమిషంలో మరణశిక్ష అమలుపై స్టే విధించింది. కోవిడ్ సోకడం వల్ల నాగేంద్రన్ మానసిక వైకల్యానికి గురైనట్లు కోర్టుకు డిఫెన్స్ లాయర్ తెలిపారు. నిజానికి బుధవారం రోజున నాగేంద్రన్కు ఉరిశిక్ష అమలు కావాల్సి ఉంది. అయితే మంగళవారం రాత్రి ఈ కేసులో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. మరోసారి సైకియాట్రి పరీక్షలు చేయాలని కోర్టుకు నాగేంద్రన్ లాయర్ కోరారు. 2009లో 32 ఏళ్ల నాగేంద్రన్ను పోలీసులు అరెస్టు చేశారు. 43 కేజీల హెరాయిన్ను స్మగ్లింగ్ చేసినందుకు అతన్ని పట్టుకున్నారు. ఈ కేసులో అతనికి ఉరిశిక్షను విధించారు.
నాగేంద్రన్ తరపు న్యాయవాదులు సింగపూర్ కోర్టును ఆశ్రయించి.. మరణశిక్షను వాయిదా వేయాలని కోరారు. కరోనా వైరస్తో బాధపడుతున్న నాగేంద్రన్ కు శిక్షను అమలు చేయకుండా ఉండాలని ప్రార్థించారు. అయితే వైరస్ నుంచి కోలుకునే వరకు ఉరిశిక్ష అమలు నిలిపివేయాలని కోర్టు ఆదేశించింది. నిందితుడు నాగేంద్రన్కు కోవిడ్ సోకిందని, వ్యాధితో బాధపడుతున్న వ్యక్తిని ఎలా ఉరితీస్తారని, కోవిడ్ వల్ల లక్షలాది మంది చనిపోయారని, కానీ ఈ కేసులో ఒకరు బ్రతికారని నాగేంద్రన్ తరపు న్యాయవాది తెలిపారు. తీవ్రమైన మానసిక రుగ్మతలతో బాధపడుతున్నవారికి మరణశిక్షలను అమలు చేయవద్దు అని ఐక్యరాజ్యసమితికి చెందిన మానవ హక్కుల సంఘం ఓ లేఖలో కోరింది. నాగేంద్రన్ ఐక్యూ 69గా ఉందని, అంటే అతను మానసిక సమస్యతో ఉన్నాడని కుటుంబసభ్యులు తెలిపారు.