ఇస్లామాబాద్ : పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు షాక్ తగిలింది. అవిశ్వాస తీర్మానం నుంచి గట్టెక్కేందుకు చేస్తున్న ప్రయత్నంలో మరో ఎదురుదెబ్బ తగిలింది. సోమవారం పాక్ పార్లమెంట్లో అవిశ్వాస ఓటింగ్కు ముందు పాకిస్తాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ (పీటీఐ) మిత్రపక్షం జమూరీ వతన్ పార్టీ నేత, కేబినెట్ పదవికి షాజైన్ బుగ్తీ రాజీనామా చేశారు. గడిచిన మూడేళ్లలో శాంతిభద్రతను మెరుగుపరిచేందుకు ఇమ్రాన్ ప్రభుత్వం ఏం చేయలేకపోయిందని ఆరోపించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ఈ కారణంతో రాజీనామా చేసినట్లు పేర్కొన్నారు.
పాక్, బలూచిస్థాన్ ప్రజల ప్రయోజనాల కోసం, మంచి భవిష్యత్ కోసం తాను ప్రతిపక్షంలో చేరానన్నారు. షాజైన్ బుగ్తీ బలూచ్లో శాంతి, సయోధ్యపై ప్రధానమంత్రికి ప్రత్యేక సహాయకుడిగా పనిచేస్తున్నారు. ఇప్పుడు రాజీనామా చేసి పాక్ డెమోక్రటిక్ మూవ్మెంట్లో చేరారు. అయితే, ఇది ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వాన్ని వ్యతిరేకించే రాజకీయ ఫ్రంట్. పాక్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు 172 మంది జాతీయ అసెంబ్లీ సభ్యుల మద్దతు తమకు ఉందని ప్రతిపక్షం పేర్కొంది.
పాక్ జాతీయ అసెంబ్లీలో 342 సీట్లున్నాయి. ప్రభుత్వంపై ప్రతిపక్షం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టగా.. ఓటింగ్ సమయంలో సభ్యులు లోపలికి రాకుండా అడ్డుకోవాలని ఇమ్రాన్ తన మద్దతుదారులను కోరాడు. ఇదిలా ఉండగా.. షాజైన్ బుగ్తీ బలూచ్ ఉద్యమానికి చెందిన ప్రముఖ నాయకుల్లో ఒకరైన అక్బర్ బుగ్తీ మునిమనవడు. అక్బర్ బుగ్తీని 2006లో బలూచిస్తాన్ కోహ్లు పట్టణంలో పాక్ సైన్యం హత్య చేసింది. బలూచ్లో షాజైన్ బుగ్తీకి మంచి పట్టుంది. ఈ క్రమంలో బుగ్తీ రాజీనామా ఇమ్రాన్కు మరింత ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది.