Shehbaz Sharif | ఇస్లామాబాద్, మార్చి 3: పాకిస్థాన్ ప్రధానమంత్రిగా షెహబాజ్ షరీఫ్ రెండోసారి ఎన్నికయ్యారు. ఆదివారం పాక్ జాతీయ అసెంబ్లీలో కొత్త ప్రధాని ఎన్నిక కోసం ఓటింగ్ నిర్వహించారు. 336 మంది సభ్యులు గల సభలో పాకిస్థాన్ ముస్లిం లీగ్- నవాజ్(పీఎంఎల్-ఎన్) అభ్యర్థి షెహబాజ్ షరీఫ్ 201 ఓట్లు సాధించారు. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు చెందిన పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ అభ్యర్థి ఒమర్ ఆయుబ్ ఖాన్కు 92 ఓట్లు వచ్చాయి. దీంతో పాకిస్థాన్ 24వ ప్రధానమంత్రిగా 72 ఏండ్ల షెహబాజ్ షరీఫ్ సోమవారం బాధ్యతలు స్వీకరించనున్నారు.
కాగా, ప్రధాని ఎన్నిక సమయంలో జాతీయ అసెంబ్లీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పీటీఐ మద్దతురాలైన సభ్యులు ఇమ్రాన్ ఖాన్ పోస్టర్లను ప్రదర్శించి ఆయనకు అనుకూలంగా నినాదాలు చేశారు. ప్రతిగా పీఎంఎల్-ఎన్ సభ్యులు కూడా నవాజ్ షరీఫ్కు అనుకూల నినాదాలు అందుకున్నారు. ఈ నినాదాల మధ్యనే ప్రధాని ఎన్నిక జరిగింది.
2022 ఏప్రిల్ నుంచి 2023 ఆగస్టు వరకు ఆయన పాక్ ప్రధానిగా వ్యవహరించారు. ఆ తర్వాత పార్లమెంటును రద్దు చేయగా ఫిబ్రవరి 8న ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో షరీఫ్ నేతృత్వంలోని పీఎంఎల్-ఎన్ 265 స్థానాల్లో పోటీ చేసి కేవలం 75 స్థానాలు దక్కించుకొన్నది. అయితే, ఏ పార్టీకీ మెజారిటీ రాకపోవడంతో సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటు తప్ప మరో మార్గం లేకుండా పోయింది.
పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్కు షెహబాజ్ షరీఫ్ తమ్ముడు. 1951 సెప్టెంబర్లో లాహోర్లో కశ్మీరీ మాట్లాడే కుటుంబంలో షరీఫ్ జన్మించారు. ఆయన కుటుంబం కశ్మీర్లోని అనంత్నాగ్ నుంచి వ్యాపారరీత్యా మొదట అమృత్సర్కు, ఆ తర్వాత పాకిస్థాన్కు వలసవెళ్లి స్థిరపడింది.
దేశంలో సోషల్ మీడియా సంస్థలపై శాశ్వత నిషేధం విధించాలని కోరుతూ దాఖలైన తీర్మానం పాకిస్థాన్ సెనెట్ ముందుకు రాబోతున్నది. సెనెటర్ బహ్రమంద్ ఖాన్ టాంగీ ప్రవేశపెట్టిన తీర్మానంపై సెనెట్ సోమవారం చర్చించనున్నది. ‘దేశ ప్రయోజనాలకు, సైన్యానికి వ్యతిరేకంగా ఈ వేదికలు ఉపయోగపడుతున్నాయి. ఫేస్బుక్, టిక్టాక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్, యూ ట్యూబ్ ప్రసారాలను శాశ్వతంగా నిషేధించాలి’ అని తీర్మానంలో సెనెటర్ కోరారు.