ఇస్లామాబాద్ : పొరుగుదేశం పాకిస్థాన్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరనున్నది. పాక్ కొత్త ప్రధానిగా షెహబాజ్ షరీఫ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పాక్ జాతీయ అసెంబ్లీలో సోమవారం జరిగిన ప్రధాని ఎన్నిక కార్యక్రమం జరగ్గా.. ఇమ్రాన్ఖాన్ నేతృత్వంలోని పాకిస్థాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ పార్టీ వాకౌట్ చేయడంతో.. షరీఫ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇంతకు ముందు ప్రధాని ఇమ్రాన్ ఖాన్పై శనివారం అర్ధరాత్రి జాతీయ అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీలు ప్రవేశపెట్టిన అవిశ్వాసం నెగ్గడంతో పదవీచ్యుతుడయ్యాడు. ఆ తర్వాత కొత్త ప్రధాని ఎన్నిక అనివార్యమైంది.
ప్రతిపక్షాలు తమ ప్రధాని అభ్యర్థిగా షెహబాజ్ షరీఫ్ను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించగా.. నామినేషన్ దాఖలు చేశారు. అయితే, ఇంతకు ముందు ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పీటీఐ పార్టీ ప్రధాన అభ్యర్థిగా మాజీ విదేశాంగ మంత్రి మొహ్మద్ ఖురేషీని ప్రధాన మంత్రి అభ్యర్థిగా ప్రకటించింది. ప్రధానిగా ఎన్నికైన షహబాజ్ ఇవాళ రాత్రి 8 గంటలకు ప్రమాణస్వీకారం చేయనున్నారు. షరీఫ్ ప్రస్తుతం ఆయన పాకిస్థాన్ ముస్లిం లీగ్ (ఎన్) పార్టీ అధ్యక్షుడిగా పని చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తొలగింపునకు వ్యతిరేకంగా లాహోర్లోని లిబర్టీ చౌక్లో పెద్ద సంఖ్యలో పీటీఐ మద్దతుదారులు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఫైసలాబాద్, ముల్తాన్, గుజ్రాన్వాలా, వెహారి, జెహ్లం, పంజాబ్ ప్రావిన్స్లోని నిరసనలు కొనసాగాయి.