పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్కు కాలం కలిసొచ్చినట్లుంది. నవాజ్ షరీఫ్ కొన్ని రోజుల్లోనే తిరిగి పాక్కు రానున్నారు. ఈ విషయంపై ఇప్పటికే పాక్ నూతన ప్రధాని, నవాజ్ అన్నయ్య షాహబాజ్ షరీఫ్ పాక్ హోంశాఖకు తగిన ఆదేశాలు జారీ చేశారు. నవాజ్ షరీఫ్కు సంబంధించిన పాస్పోర్టు క్లియరెన్స్ చేయాలని, ఆయనకు దౌత్యపరమైన పాస్పోర్టును జారీ చేయాలని పాక్ ప్రధాని హోంశాఖను ఆదేశించారు. ఈ విషయాన్ని పాక్ మీడియా పేర్కొంది. నవాజ్ షరీఫ్తో పాటు పాక్ ఆర్థిక శాఖ మాజీ మంత్రి ఇషాక్ డార్ పాస్పోర్టును కూడా పునరుద్ధరించాలని ఆదేశించారు.
పనామా పేపర్ల కేసులో 2017 లో పాక్ ప్రధాని పీఠం నుంచి నవాజ్ షరీఫ్ను సుప్రీంకోర్టు పదవి నుంచి తొలగించింది. ఇక.. ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆయనపై మరిన్ని కేసులు మోపింది. తాను అనారోగ్యంతో ఉన్నానని, చికిత్స నిమిత్తం లండన్కు వెళ్లడానికి అనుమతి కావాలని నవాజ్ కోర్టును వేడుకున్నారు. దీంతో లండన్ వెళ్లడానికి పాక్ కోర్టు అంగీకరించింది. 2019 నుంచి నవాజ్ షరీఫ్ లండన్లోనే తలదాచుకుంటున్నాడు. డాక్టర్లు ప్రయాణాలకు అంగీకరిస్తే పాక్కు తిరిగి వస్తానని గతంలో నవాజ్ షరీఫ్ పేర్కొన్నారు. అయితే.. ఇన్ని రోజులు పాక్ ప్రధాని పీఠంపై ఇమ్రాన్ ఉండటంతో నవాజ్ షరీఫ్ పాక్లో అడుగు పెట్టలేదు. ఇప్పుడు ప్రధానిగా తన అన్నయ్య షాహబాజ్ రావడంతో నవాజ్కు కాలం కలిసొచ్చింది.