ఇస్లామాబాద్, డిసెంబర్ 8: పాకిస్థాన్లో మైనారిటీలపై, ముఖ్యంగా మహిళలపై అరాచకాలు పెరుగుతున్నాయి. ప్రతీ ఏటా వేలాది మంది బాలికలను, మహిళలను కిడ్నాప్ చేసి లైంగికదాడికి పాల్పడుతున్నారు. బలవంతంగా వారి మతం మారుస్తున్నారు. ఇస్లాంలో చేరుస్తున్నారు. బ్రిటన్కు చెందిన ఆల్ పార్టీ పార్లమెంటరీ గ్రూప్(ఏపీపీజీ) తన నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది. పేదలు, నిరక్షరాస్యులను లక్ష్యంగా చేసుకొని ఈ దారుణాలు జరుగుతున్నట్టు పేర్కొన్నది. పూర్తి సంఖ్యను వెల్లడించలేదు. అయితే, ‘పాకిస్థాన్లోని ఒక్క పంజాబ్ ప్రావిన్స్లోనే 2021 మొదటి అర్ధ భాగంలో 6,574 మంది మహిళలు, బాలికలను కిడ్నాప్ చేశారు. వీరిలో 2,500 మందికి పైగా లైంగిక దాడికి గురయ్యారు’ అని తెలిపింది.