లండన్, డిసెంబర్ 12: కొవిడ్ టీకా కొవిషీల్డ్ ఉత్పత్తి చేసే సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అదర్ పూనావాలా లండన్లో ఖరీదైన భవనాన్ని కొనుగోలు చేశారు. 1920లో హైడ్ పార్క్ దగ్గర నిర్మించిన ఈ 25 వేల చదరపు అడుగుల భవనం కొనుగోలు ఈ ఏడాది లండన్లో రెండో అత్యంత ఖరీదైన ఇంటి అమ్మకంగా తెలుస్తున్నది. పోలెండ్ వ్యాపారవేత్త జాన్ కల్క్జిక్ కూతురి నుంచి సుమారు రూ.1,444.4 కోట్లకు పూనావాలా ఈ ఇంటిని కొనుగోలు చేశారు. పూనావాలా కుటుంబ సంస్థ అయిన సీరమ్ లైఫ్ సైన్సెస్ ఈ భవనం కొన్నట్టు తెలుస్తున్నది. తాజాగా కొన్న ఇల్లు వారి కంపెనీకి స్థావరంగా ఉపయోగపడుతుందని సమాచారం.