Iranian warship : ఇరాన్కు చెందిన యుద్ధ నౌకను శ్రీలంక తీరంలో అమెరికన్ సబ్మెరైన్ బుధవారం పేల్చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన మరువకముందే ఇప్పుడు ఇంకో ఇరాన్ నౌక ప్రమాదపు అంచున ఉంది. ఇరాన్కు చెందిన మరో యుద్ధనౌక శ్రీలంక తీరంలో ఉంది. దీంతో ఈ నౌకను కూడా అమెరికా పేల్చేస్తుందా అనే సందేహాలు తలెత్తుతున్నాయి. శ్రీలంక మంత్రి నలిందా జయతిస్సా ఈ అంశంపై స్పందించారు.
100 మంది సిబ్బందితో కూడిన ఇరాన్ నౌక తమ దేశ జలాలకు దగ్గర్లోనే ఉందని నలిందా ప్రకటించారు. ఈ నౌకను కూడా ముంచేస్తారేమో అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. నౌకలోని సిబ్బందిని రక్షించేందుకు తాము ప్రయత్నిస్తున్నామని ఆయన తెలిపారు. దీనిపై శ్రీలంక ఎంపీ నమాల్ రాజపక్స మాట్లాడుతూ.. ఆ నౌకకు సంబంధించిన సిబ్బంది తమ పోర్టు నుంచి సాయం కోసం అడిగారని, దీనికోసం చర్చలు జరుపుతున్నామని, అనుమతి మంజూరుపై ఆలోచిస్తున్నామని ఆయన తెలిపారు. ఇరాన్ నౌకకు సాయం చేసి రక్షించే అంశంపై తమ ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటున్నామని లేకుంటే గతంలో బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ సందర్భంగా అప్పటి శ్రీలంక ప్రభుత్వం అనుసరించిన విధానాన్ని అవలంభిస్తామని ఆయన అన్నారు.
1971లో బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ సందర్భంగా పాకిస్తాన్ విమానానికి శ్రీలంక ఆశ్రయమిచ్చి, చమురు నింపేందుకు సహాయపడింది. ఈ యుద్ధం సమయంలో తటస్థంగా వ్యవహరించింది. ఈ నేపథ్యంలో తాము కూడా అలాగే వ్యవహరించే అవకాశం ఉందని నమాల్ రాజపక్స అభిప్రాయపడ్డారు. మరోవైపు ఈ నౌకకు సాయం చేయాల్సిందిగా శ్రీలంక అధ్యక్షుడు అనురా కుమారను ఇరాన్ ప్రభుత్వం కోరింది. ఇరాన్కు, శ్రీలంకకు మధ్య మంచి సంబంధాలున్నాయి. శ్రీలంక టీని ఇరాన్ ఎక్కువగా కొంటుంది. అయితే, ఇరాన్ రెండో యుద్ధ నౌక విషయంలో అమెరికా ఎలా స్పందిస్తుందో చూడాలి.