శ్రీలంకలో ఆర్థిక, రాజకీయ సంక్షోభం నెలకొన్న విషయం తెలిసిందే. ఇంధన కొరత కారణంగా దాదాపు నెలపాటు మూతపడిన ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు సోమవారం తిరిగి తెరుచుకున్నాయి. పాఠశాలలను సోమ, మంగళ, గురువారాల్లో.. మూడు రోజులు మాత్రమే నడిపిస్తామని అధికారులు పేర్కొన్నారు. వారంలో మిగిలిన రెండు రోజుల్లో విద్యార్థులకు ఆన్లైన్లో తరగతులు నిర్వహిస్తామని వెల్లడించారు.
స్కూళ్ల మొదటి టర్మ్ను సెప్టెంబర్ 7వరకు పాఠశాల విద్యాశాఖ పొడిగించింది. పాఠశాలలు కూడా మొదటి టర్మ్ ముగింపులో పరీక్షలు నిర్వహించవు. మూల్యాంకనానికి ప్రత్యామ్నాయాలను చూసుకోవాలని ప్రధానోపాధ్యాయులకు విద్యాశాఖ సూచించింది. అలాగే, పాఠశాల బస్సులకు అన్ని ప్రభుత్వ ఇంధన డిపోల నుంచి ఇంధనం అందించాలని శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే అధికారులను ఆదేశించారు.