కీవ్: సుమారు 400 మంది ఆశ్రయం పొందిన స్కూల్పై రష్యా దళాలు బాంబు దాడులు చేశాయని ఉక్రెయిన్ ఆరోపించింది. మారియుపోల్లోని ఆర్ట్ స్కూల్లో ఈ ఘటన జరిగిందని ఆ నగర పాలక మండలి తెలిపింది. బాంబుల దాడిలో భవనం పూర్తిగా ధ్వంసమైందని, అందులోని శరణార్థులు శిథిలాల్లో చిక్కుకున్నారని చెప్పింది. అయితే ఎంత మంది మరణించారన్నది అధికారులు వెల్లడించలేదని ఏఎఫ్ వార్తా సంస్థ పేర్కొంది.
మరోవైపు ఉక్రెయిన్పై రష్యా యుద్ధం ఆదివారం నాటికి 25వ రోజుకు చేరింది. అజోవ్ సముద్రంలోని వ్యూహాత్మక నౌకాశ్రయమైన మారియుపోల్ను రష్యా దళాలు చుట్టుముట్టాయి. ఆహారం, నీటి సరఫరాను బంద్ చేయడంతోపాటు నగరంపై బాంబు దాడులను రష్యా సైనికులు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం స్థానిక ఆర్ట్ థియేటర్పై బాంబు దాడుల్లో వందల సంఖ్యలో పౌరులు మరణించి ఉంటారని అనుమానిస్తున్నారు. సుమారు 200 మందిని కాపాడినట్లు ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. శిథిలాల కింద మరింత మంది చిక్కుకున్నట్లు చెప్పారు.
కాగా, మారియుపోల్ స్వాధీనం నేపథ్యంలో రష్యా సైనికుల యుద్ధ నేరాలు చరిత్రలో నిలిచిపోతాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ విమర్శించారు. సుమారు నాలుగు లక్షల మంది ప్రజలు ఈ నగరంలో చిక్కుకుని ఆహారం, నీరు లేక నరకయాతన అనుభవిస్తున్నారని ఆరోపించారు.