కీవ్: రష్యా వైమానిక దాడుల్లో ఉక్రెయిన్ స్కూల్పై బాంబులు పడ్డాయి. ఈ ఘటనలో సుమారు 60 మంది మరణించి ఉంటారని స్థానిక అధికారులు తెలిపారు. ఉక్రెయిన్ లుహాన్స్క్లోని బిలోహోరివ్కాలో ఒక స్కూల్పై శనివారం మధ్యాహ్నం రష్యా విమానాలు బాంబులు వేశాయని గవర్నర్ సెర్హి గైదై తెలిపారు. ఆ స్కూల్ బిల్డింగ్కు మంటలు వ్యాపించడంతో అందులో ఆశ్రయం పొందుతున్న 90 మందిలో 60 మంది వరకు చనిపోయినట్లు చెప్పారు. సుమారు నాలుగు గంటలు శ్రమించి మంటలను అదుపు చేసిన తర్వాత శిథిలాల తొలగింపు పని చేపట్టినట్లు వెల్లడించారు. చిక్కుకున్న 30 మందిని కాపాడి అక్కడి నుంచి తరలించినట్లు చెప్పారు. ఇందులో ఏడుగురు గాయపడినట్లు తెలిపారు. 60 మంది చనిపోయి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు రెండు మృతదేహాలను వెలికి తీసినట్లు వివరించారు.
కాగా, రష్యా సైన్యం స్వాధీనం చేసుకున్న మరియుపోల్లోని అజోవ్స్టాల్ స్టీల్ ప్లాంట్ నుంచి వందలాది మందిని యునైటెడ్ నేషన్స్, ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ రెడ్ క్రాస్ (ICRC) అక్కడి నుంచి తరలించింది. సుమారు 300 మందిని అక్కడి నుంచి కాపాడినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపారు. రెండవ ప్రపంచ యుద్ధంలో జర్మనీ లొంగిపోయిన నేపథ్యంలో ప్రతి ఏటా మే 8న జరుపుకునే విక్టరీ డే సందర్భంగా ఆదివారం ఆయన ఉద్వేగంతో ప్రసగించారు. రష్యా దాడితో ఉక్రెయిన్కు చెడు తిరిగి వచ్చిందన్నారు. అయితే తమ దేశం విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.