శాన్ఫ్రాన్సికో: ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీ జాబితాలో ఇప్పుడు సౌదీకి చెందిన ఆయిల్ కంపెనీ ఆరామ్కో తొలి స్థానంలో నిలిచింది. టెక్నాలజీ దిగ్గజం ఆపిల్ సంస్థను వెనక్కి నెట్టేసి ఆరామ్కో కంపెనీ రికార్డు క్రియేట్ చేసింది. రెండేళ్ల తర్వాత మళ్లీ టాప్ ప్లేస్ను ఆరామ్కో చేజిక్కించుకున్నది. ఆపిల్ సంస్థలో ఇన్వెస్టర్లు తమ షేర్లను అమ్మేయడంతో ఆ కంపెనీ విలువ తగ్గింది. బుధవారం రోజున ఆపిల్ షేర్లు 5 శాతం పడిపోయాయి. దీంతో స్టాక్ మార్కెట్లో ఆ కంపెనీ విలువ 2.37 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. ఇంధన కంపెనీ ఆరామ్కో విలువు 2.42 ట్రిలియన్ల డాలర్లుగా ఉన్నట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి. చైనాలో కోవిడ్ లాక్డౌన్ వల్ల జూన్ త్రైమాసికంలో కంపెనీ లాభాలు సుమారు 8 బిలియన్ల డాలర్ల వరకు పడిపోయే అవకాశాలు ఉన్నట్లు ఆ కంపెనీ తన వార్నింగ్లో తెలిపింది. ఆయిల్ దిగ్గజం ఆరామ్కో గత ఏడాది 124 శాతం లాభాలను చవిచూసింది.