ఒట్టావా, అక్టోబర్ 18: రానున్న కాలంలో దేశాలు, కంపెనీల మధ్య అంతరిక్ష పోరు తప్పదా? లక్షల కొద్దీ ప్రయోగిస్తున్న శాటిలైట్లతో మానవులకు ప్రమాదం ఉన్నదా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తున్నది. లక్షల శాటిలైట్ల కారణంగా అంతరిక్షంలో కాంతి కాలుష్యం సంభవిస్తుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. దేశాల మధ్య అంతరిక్ష ఘర్షణలు జరుగుతాయని పరిశోధకులు చెబుతున్నారు. అదే సమయంలో అంతరిక్షంలో లక్షల కొద్దీ శాటిలైట్ల కారణంగా ట్రాఫిక్ పెరిగి ఉపగ్రహాలు ఢీకొనే పరిస్థితులు తలెత్తవచ్చని వారు హెచ్చరిస్తున్నారు. ఈ మేరకు కెనడాలోని యూనివర్సిటీ ఆఫ్ బ్రిటీష్ కొలంబియా పరిశోధకులు వెల్లడించారు.
ఇప్పటికే అంతరిక్షంలో ప్రయోగాలు చేసేందుకు వివిధ దేశాలు, ప్రైవేటు కంపెనీలు పోటీ పడుతున్నాయి. ఏటా వేల సంఖ్యలో ఉపగ్రహాలను ప్రయోగిస్తున్నాయి. వీటిలో కమ్యూనికేషన్ శాటిలైట్లే అధికం. లో ఎర్త్ ఆర్బిట్ (దిగువ భూ కక్ష్య) శాటిలైట్లతో నిండిపోయింది. త్వరలో ఈ సంఖ్య పది లక్షలను మించిపోయే అవకాశం ఉందని పరిశోధకులు తెలిపారు. ప్రస్తుతం లో ఎర్త్ ఆర్బిట్లో ఉన్న శాటిలైట్ల కంటే ఇది 115 రెట్లు ఎక్కువ కావడం గమనార్హం.