కాట్మాండు: లాంగ్టాంగ్ లిరుంగ్ పర్వతం(Mount Langtang Lirung) నేపాల్లోనే ఉన్నది. దీని ఎత్తు 7245 మీటర్లు. కాట్మాండుకు ఉత్తరాన 45 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఈ పర్వతానికి విషాద చరిత్ర ఉన్నది. 2015, ఏప్రిల్లో నేపాల్ను 7.8 తీవ్రతతో భూకంపం కుదిపేసిన విషయం తెలిసిందే. అయితే ఆ భూకంపం వేళ లాంగ్టాంగ్ పర్వతంపై దక్షిణం వైపున కొండచరియలు విరిగిపడ్డాయి. గ్లేసియర్పై మట్టిచరియలు విరిగిపడడంతో లాంగ్టాంగ్ గ్రామం పూర్తిగా నేలమట్టం అయ్యింది. ఆ ఘటనలో 300 మంది మృతిచెందారు. ఇక ఈ బుధవారం రోజున చైనా బోర్డర్ వద్ద సుమారు 4.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. నేపాలీ సమయం ప్రకారం ఉదయం 8.37 నిమిషాలకు భూమి కంపించింది. అయితే ఆ సమయంలోనే లాంగ్టాంగ్ పర్వతంపై ఉత్తరం దిక్కున కొండచరియ విరిగిపడినట్లు తెలుస్తోంది.
లాంగ్టాంగ్ లిరుంగ్ పర్వతం పూర్తిగా నేపాల్లోనే ఉన్నది. వర్షాకాలం వల్ల బోర్డర్ వద్ద ఉన్న లెండే ఖోలా నదిపై బ్లాకేజీ ఏర్పడింది. అయితే లాంగ్టాంగ్ నుంచి కూలిన కొండచరియ ఆ నదిలో పడింది. దీంతో ఒక్కసారిగా సరస్సు బద్దలైంది. ఇక భారీగా బురద, రాళ్లు దిగువకు హోరెత్తాయి. ఆ ప్రవాహం అంతా త్రిశూలీ నదిలోకి వెళ్లినట్లు ప్లానెట్ ల్యాబ్ శాటిలైట్ ఇమేజ్ల ఆధారంగా నిపుణులు ఈ అంచనా వేశారు. కానీ దీనికి సంబంధించిన నిర్దారణ జరగలేదు. భూకంపం వల్ల లాంగ్టాంగ్పై ఉత్తరం వైపున ఉన్న కొండచరియ విరిగి పడి ఉంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఒకవేళ కొండచరియ విరిగిపడడం వల్ల ఆ ప్రాంతంలో భూకంపం వచ్చినట్లు రికార్డు అయ్యిందా అన్న కోణంలోనూ నిపుణులు అంచనా వేస్తున్నారు.
కొండచరియల వల్ల కదలికలు రావడం వల్ల అక్కడ పర్వత ప్రాంతం మొత్తం కదిలింది. ఇక ఆ పర్వతంపై ఉన్న స్నో, ఐస్ మొత్తం కిందకు దూకినట్లు కూడా అంచనా వేస్తున్నారు. గ్లోబల్ వార్మింగ్ వల్ల స్థిరంగా లేని స్నో, ఐస్ బహుశా కిందకు దూకి ఉంటుందని భావిస్తున్నారు. వర్షాకాలం సమయంలో పర్వత కొన ప్రాంతాలు.. భారీ మంచు వల్ల కూలే ప్రమాదం ఉంటుందని కూడా చెబుతున్నారు. నేపాల్లో ఉన్న గ్లేసియర్ వల్లే ఈ ఘటన జరిగినా.. ఆ ప్రాంతంలో ఉన్న అనేక సరస్సులు ఎప్పుడైనా బద్దలయ్యే అవకాశాలు ఉన్నాయి. కొండలపై సుదీర్ఘకాలంగా ఉన్న మంచు కరిగిపోవడం, బండరాళ్లు కూలిపోవడం వల్ల టిబెట్ పీఠభూమిలో ఇటీవల విపత్తులు సంభవిస్తున్నట్లు భావిస్తున్నారు.
భూ కంపాలతో సంబంధం లేకుండానే ఇటీవల హిమాలయాల్లో సునామీ లాంటి ఘటనలు అనేకం జరిగాయి. 2021లో చమోలీలో, మేలాంచి, 2023లో సిక్కింలో, 2024తో థేమ్లో, 2025లో బొటేకోసిలో, 2026లో తాజా ఘటనలు చోటుచేసుకున్నాయి. అయితే ఈ ప్రమాదలన్నీ కూడా వర్షాకాలం సీజన్లో చోటుచేసుకోవడం గమనార్హం. చైనా, నేపాల్ బోర్డర్ వద్ద గత ఏడాది జూలై 8వ తేదీన వచ్చిన వరదల వల్ల 18 మంది మృతిచెందారు. బోర్డర్ చెక్పాయింట్, హైవేలు, హైడ్రోఎలక్ట్రిక్ ప్లాంట్లు, ట్రాన్స్మిషన్ లైన్లు ధ్వంసం అయ్యాయి. తాజా ఘటనలో చాలా తక్కువ సమయంలోనే బురదతో కూడిన వరద నీరు రసువా చెక్పాయింట్కు చేరుకున్నట్లు అంచనా వేశారు.
గురువారం నాటి ఘటనలో బోటెకోసి నది మార్గంలో ఉన్న ఆరు మేజర్ హైడ్రోపవర్ ప్లాంట్లు, ట్రాన్స్మిషన్ లైన్లు, ఎలక్ట్రిక్ సబ్స్టేషన్లు డ్యామేజ్ అయ్యాయి. నేపాల్లోని నువాకోట్లో ఉన్న 25 మెగావాట్ల గ్రిడ్ సోలార్ జనరేషన్ ప్లాంట్ పూర్తిగా బురదమయం అయ్యింది. బూటోకోసి, త్రిశూలీ నదిపై ఉన్న డజన్ల బ్రిడ్జీలు కొట్టుకుపోయాయి. సుమారు 70 కిలోమీటర్ల దూరం వరకు ఆ వరద బీభత్సం సృష్టించినట్లు అంచనా వేస్తున్నారు.