మాస్కో: రష్యాపై ఆంక్షలు విధించడం యుద్ధంతో సమానమని అధ్యక్షుడు పుతిన్ అన్నారు. ఉక్రెయిన్పై దండయాత్ర నేపథ్యంలో పశ్చిమ దేశాలు విధిస్తున్న ఆర్థిక ఆంక్షలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉక్రెయిన్పై యుద్ధాన్ని పుతిన్ సమర్థించుకున్నారు. శాంతియుతంగా సమస్య పరిష్కారానికి రష్యా ప్రయత్నించిందని తెలిపారు. అయితే ఉక్రెయిన్ దీనికి అడ్డంకులు సృష్టించిందని, శాంతి ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ఆరోపించారు. రష్యాకు ముప్పుగా పరిణమించిన ఉక్రెయిన్ను సైనిక, అణ్వాయుధ రహితంగా చేస్తామన్నారు. ఈ లక్ష్యం నెరవేరే వరకు యుద్ధం కొనసాగుతుందని, ఊహించిన దాని కన్నా మరింత భీకరంగా యుద్ధం ఉంటుందన్నారు.
ఉక్రెయిన్పై నో ఫ్లై జోన్ విధించే ఏ ప్రయత్నమైనా రష్యాపై యుద్ధంగా పరిగణిస్తామని పుతిన్ హెచ్చరించారు. నాటో నిర్ణయాల వల్లనే ఉక్రెయిన్పై తాము దాడికి దిగినట్లు చెప్పారు. రష్యాపై ఆంక్షలు విధించిన నాటో కూడా తగిన మూల్యం చెల్లించుకుంటుందని అన్నారు. ఉక్రెయిన్ నగరాలపై రష్యా బాంబులతో దాడులు చేస్తున్నట్లు వస్తున్న ఆరోపణలను ఖండించారు. ఉద్దేశ పూర్వకంగా అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. తమ డిమాండ్లకు అంగీకరిస్తే ఉక్రెయిన్తో చర్చలు జరుపుతామని తెలిపారు. రష్యాలో మార్షల్ లా అవసరం లేదని పుతిన్ వ్యాఖ్యానించారు.