న్యూయార్క్ : భారత సంతతికి చెందిన ప్రముఖ రచయిత సల్మాన్ రష్దీపై నిన్న అమెరికాలో దాడి జరిగిన విషయం తెలిసిందే. సల్మాన్ రష్దీ ప్రస్తుతం వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నారని, ఆయన కాలేయం పూర్తిగా దెబ్బతిన్నదని వైద్యులు తెలిపారు. రష్దీ తన కన్నును కూడా కోల్పోయే అవకాశం ఉందన్నారు. న్యూయార్క్లోని చౌటౌక్వా ఇన్స్టిట్యూట్లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న రష్దీపై ఓ దుండగుడు దాడికి పాల్పడ్డాడు. ప్రసంగిస్తున్న సమయంలో ఒక్కసారిగా స్టేజ్పైకి దూసుకొచ్చి 10-15 సార్లు కత్తితో పొడిచినట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. దీంతో రష్దీ మెడ, పొత్తికడుపుపై తీవ్ర గాయాలయ్యాయి.
సల్మాన్ రష్దీపై దాడి చేసిన నిందితుడిని న్యూయార్క్ పోలీసులు గుర్తించారు. న్యూజెర్సీకి చెందిన హదీ మాటర్(24) అని పోలీసులు పేర్కొన్నారు. అయితే రష్దీపై దాడి వెనుక ఏమైనా కుట్ర ఉందా? అనే విషయం తెలియాల్సి ఉంది. ఎందుకు దాడి చేశాడనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. రష్దీని ఇంటర్వ్యూ చేసిన హెన్రీ రీస్పై కూడా హదీ మాటర్ దాడికి పాల్పడ్డాడు. హెన్రీ కూడా గాయపడ్డాడు. రష్దీపై దాడికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
సల్మాన్ రష్దీ రాసిన ‘ది సాటానిక్ వెర్సెస్’ అనే పుస్తకాన్ని ఇరాన్లో 1988 నుంచి నిషేధించారు. రష్దీని చంపేస్తామం టూ బెదిరింపులు వచ్చాయి. రష్దీని చంపిన వారికి 30 లక్షలకు పైగా డాలర్లు రికార్డుగా ఇస్తామని ప్రకటనలు కూడా చేశారు. ఈ పుస్తకం ఇస్లాంను దూషించే విధంగా ఉందనే ఆరోపణలు ఉన్నాయి.