Sai Varshith | అగ్రరాజ్యాన్ని ఏలడమే లక్ష్యంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ను చంపేందుకు ప్లాన్ చేసిన భారత సంతతి యువకుడు సాయివర్షిత్ కందుల (19)కు దాదాపు పదేళ్ల జైలుశిక్ష పడే అవకాశం ఉంది. జైలుశిక్షతో పాటు రూ.2 కోట్ల వరకు విధించనున్నట్లు తెలుస్తోంది. సోమవారం రాత్రి 10 గంటల సమయంలో ఓ ట్రక్కుతో వైట్హౌస్పై దాడికి యత్నించిన సాయివర్షిత్ను అరెస్టు చేసిన పోలీసులు.. బుధవారం నాడు ఫెడరల్ కోర్టు జడ్జి ముందు హాజరుపరిచారు. ఆరెంజ్ కలర్ జంప్ సూట్లో న్యాయస్థానానికి వచ్చిన సాయి వర్షిత్.. జడ్జి రాబిన్ మెరివెదర్ అడిగిన ప్రశ్నలకు వినయంగా సమాధానాలు చెప్పాడు. అయితే తనపై ఆస్తుల ధ్వంసం, ర్యాష్ డ్రైవింగ్, ప్రెసిడెంట్ను చంపేస్తానని బెదిరించడం, అనుమతి లేకుండా వైట్హౌస్లోకి చొరబడటం వంటి అభియోగాలపై కేసులు నమోదయ్యాయని సాయివర్షిత్కు జడ్జి తెలిపారు. ఈ నేరాలకు గానూ గరిష్ఠంగా పదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.2కోట్ల జరిమానా విధించే అవకాశం ఉందని వివరించారు. అనంతరం తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేశారు. అలాగే మే 30 దాకా సాయివర్సిత్ను కస్టడీకి ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
సోమవారం రాత్రి 10 గంటల సమయంలో వైట్హౌస్ సమీపంలో ఓ ట్రక్కు కలకలం సృష్టించింది. భవనం బయటి సైడ్వాక్ నుంచి అడ్డదారిలో వేగంగా దూసుకొచ్చిన ట్రక్కు శ్వేతసౌధం ఉత్తరభాగంవైపు భద్రత నిమిత్తం ఏర్పాటు చేసిన ట్రాఫిక్ బారియర్స్ను ఢీకొట్టింది. ఆ తర్వాత రివర్స్ డైరెక్షన్లో వెనక్కి వచ్చి మరోసారి ఢీకొట్టింది. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ట్రక్కును చుట్టుముట్టి వర్షిత్ను అదుపులోకి తీసుకున్నారు.
‘యూ-హౌల్’ రెంటల్ కంపెనీ నుంచి సాయివర్షిత్ ఓ ట్రక్కును అద్దెకు తీసుకొన్నాడు. అనంతరం.. వైట్హౌస్ బయట ఉన్న సైడ్వాక్ వద్దకు ట్రక్కును పోనిచ్చాడు. అనంతరం ట్రాఫిక్ బారియర్స్ను పలుమార్లు ఢీకొట్టాడు. దాడికి సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు తన గ్రీన్బుక్లో నిందితుడు రాసుకొన్నట్టు అధికారులు తెలిపారు. నిందితుడి నుంచి నాజీ జెండాను స్వాధీనం చేసుకొన్నట్టు పేర్కొన్నారు. ఈ జెండాను ఆన్లైన్లో అతడు కొనుగోలు చేసినట్టు వెల్లడించారు.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ను హత్య చేయాలనే లక్ష్యంతోనే ఉద్దేశపూర్వకంగా ట్రక్కుతో దాడికి యత్నించినట్టు నిందితుడు సాయివర్షిత్ పోలీసులకు తెలిపాడు. దీనికోసం ఆరు నెలలుగా పక్కా ప్లాన్ వేసి ఈ దాడికి యత్నించినట్టు వెల్లడించాడు. ఈ మేరకు సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ వర్గాలు మీడియాకు తెలిపాయి. ‘శ్వేతసౌధంలోకి ప్రవేశించి.. అధికారాన్ని కైవసం చేసుకొని అమెరికాకు నేతృత్వం వహించడమే నా లక్ష్యం’ అని వర్షిత్ పోలీసులకు తెలిపాడు. అధికారాన్ని ఎలా దక్కించుకుంటావని సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ అడగ్గా.. ‘నా ప్రయత్నానికి అడ్డొస్తే, అధ్యక్షుడు బైడెన్నే కాదు.. ఎవర్నైనా చంపేస్తా లేదా గాయపరుస్తా’ అని వర్షిత్ చెప్పినట్టు అధికారులు పేర్కొన్నారు. ‘హిట్లర్ అంటే నాకు ఇష్టం. ఆయనకు నేను ఫ్యాన్. హిట్లర్ ఓ బలమైన నేత. నాజీలకు గొప్ప చరిత్ర ఉంది’ అని వర్షిత్ పేర్కొన్నట్టు తెలిపారు. వైట్హౌస్పై దాడి కేసులో వర్షిత్పై మారణాయుధాల వినియోగం, నిర్లక్ష్య డ్రైవింగ్, అధ్యక్షుడిపై హత్యాయత్నం, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం వంటి అభియోగాల కింద కేసు నమోదు చేసినట్టు అధికారులు తెలిపారు.
మిస్సోరిలోని ఛెస్ట్ఫీల్డ్కు చెందిన సాయి వర్షిత్ది భారత సంతతికి చెందిన కుటుంబం. 2022లో మార్క్వెట్ సీనియర్ హైస్కూలు నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు.