లండన్: ఉక్రెయిన్పై రష్యా యుద్ధం శనివారానికి మూడో రోజుకు చేరింది. రాజధాని కీవ్ వైపు రష్యా దళాలు దూసుకుపోతున్నాయి. ఈ నేపథ్యంలో తాజా సమాచారాన్ని బ్రిటన్ రక్షణ మంత్రిత్వ శాఖ శనివారం విడుదల చేసింది. రష్యా సైనిక దళాలు కీవ్ నగరానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయని తెలిపింది. అయితే రష్యా దళాలు ముందుకు సాగుతున్నప్పటికీ ఇంకా పైచేయి సాధించలేదని పేర్కొంది. ఉక్రెయిన్ ఎయిర్స్పేస్పై నియంత్రణను రష్యా ఇంకా తెచ్చుకోలేదని చెప్పింది. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆశించినంతగా ఆ దేశ వైమానిక దళం ప్రభావాన్ని చూపలేకపోయినట్లు అభిప్రాయపడింది.
మరోవైపు రష్యా దళాలను ఉక్రెయిన్ సైనికులు తీవ్రంగా ప్రతిఘటిస్తున్నారని బ్రిటన్ తెలిపింది. దీంతో రష్యా సైనికులు వేల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారని చెప్పింది. రష్యా ఊహించిన దానికంటే ఆ దేశ సైనికుల ప్రాణ నష్టం ఎక్కువగా ఉన్నదని పేర్కొంది. ఈ మేరకు తాజా నిఘా సమాచారాన్ని బ్రిటన్ రక్షణ మంత్రిత్వ శాఖ ట్విట్టర్లో షేర్ చేసింది.
మరోవైపు రష్యా యుద్ధ ప్రణాళికలను తాము పట్టాలు తప్పించామని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ తెలిపారు. ఆ దేశ ప్రజనుద్దేశించి టీవీలో శనివారం ఆయన మాట్లాడారు. రాజధాని కీవ్ స్వాధీనానికి రష్యా దళాలు చేసిన ప్రయత్నాలను ఉక్రెయిన్ ఆర్మీ తిప్పికొట్టిందని అన్నారు. దేశంలోని మెట్రో నగరాలతోపాటు ప్రధాన నగరాలు తమ ఆర్మీ నియంత్రణలోనే ఉన్నాయని వెల్లడించారు. ఆయుధాలు వీడేది లేదన్న ఆయన తుది వరకు పోరాడుతామని ప్రతిజ్ఞ చేశారు.
We can confirm the latest developments in Ukraine: pic.twitter.com/HOW8dM5m0b
— Ministry of Defence 🇬🇧 (@DefenceHQ) February 26, 2022